ఇప్పుడొచ్చి చేసేదేమిటి జగన్?
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:20 AM
ముగుస్తున్న మామిడి సీజన్ ఇప్పటికే 2.42 లక్షల టన్నుల కొనుగోళ్లు 15 రోజుల్లో మిగిలిన కాయల అమ్మకాలు
చిత్తూరు, ఆంధ్రజ్యోతి: మామిడి సీజన్ రెండు వారాల్లో ముగియనుంది. కష్టకాలమంతా వదిలేసి, ఆఖరి రోజుల్లో మామిడి రైతు కన్నీళ్లు తుడవడానికంటూ వైసీపీ అధినేత జగన్.. చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తుండడం పట్ల అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 9న ఆయన బంగారుపాళ్యంలోని ఒక మామిడికాయల మండీని సందర్శించనున్నారు. నిజానికి గుజ్జు పరిశ్రమలు మామిడి కాయలు కొనుగోలు చేయడానికి సుముఖంగా లేని రోజుల్లో రైతులు అల్లాడిపోయారు. చంద్రబాబు చొరవతో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రూపాయల సబ్సిడీ ప్రకటించాకే పరిశ్రమల్లో కొనుగోళ్లు మొదలయ్యాయి. దీంతో మామిడిలోడ్లతో ట్రాక్టర్లు బారులు తీరాయి. ఈ కాలమంతా ప్రకటనలకే పరిమితం అయిన మాజీ సీఎం జగన్రెడ్డి సీజన్ ముగిసే సమయానికి వచ్చి ఓదార్చడం వల్ల రైతులకు ఏమి ప్రయోజనం ఉంటుందనే చర్చ జరుగుతోంది.
ఫ్యాక్టరీల్లో, ర్యాంపుల్లో కలిపి ఇప్పటికే 2.42 లక్షల టన్నుల మామిడి కాయల్ని కొనుగోలు చేశారు. 1.48 లక్షల టన్నుల కాయలు ఇంకా పొలాల్లో ఉన్నాయని అంచనా. రెండు వారాల్లో మొత్తం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో పోల్చుకుంటే చిత్తూరు జిల్లాలోనే మామిడి అధికం. చిత్తూరు జిల్లాలో ఈ మామిడి ప్రాసెసింగ్ ప్రక్రియ ఇంకా రెండు వారాలకు పైబడి ఉండేలా కాయలు మిగిలి ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో ఇప్పటికే ప్రక్రియ పూర్తయింది. తిరుపతి జిల్లాలో నాలుగైదు రోజులు ఉండే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో ఈసారి 5 లక్షల టన్నుల తోతాపురి దిగుబడి వచ్చినట్లు అంచనా. ఇందులో సీజన్ ప్రారంభంలోనే పచ్చళ్ల కోసం కొన్ని మామిడి కాయలు అమ్ముడైపోయాయి. అలాగే కలర్ తోతాపురిని మంచి ధరలకు బయట అమ్ముకున్నారు. పచ్చళ్లకు, కలర్ కాయలు కలిపి 40వేల టన్నులు అమ్ముడయ్యాయి. 1.76 లక్షల టన్నుల కాయల్ని ఆయా ఫ్యాక్టరీలు కొనుగోలు చేయగా.. కిలోకు రూ.5 నుంచి రూ.6 మధ్యలో ఫ్యాక్టరీలు రైతులకు ఇచ్చాయి.
తోతాపురి అమ్మకాలు ఇలా...
జిల్లా మొత్తం సేకరణ ఫ్యాక్టరీల్లో ర్యాంపులు
(టన్నుల్లో..)
చిత్తూరు 2.42 లక్షలు 1.76లక్షలు 66 వేలు
తిరుపతి 62 వేలు 41వేలు 21 వేలు
అన్నమయ్య 16 వేలు 15వేలు వెయ్యి
బయటి ప్రాంతాల ర్యాంపులకు తరలింపు
జిల్లాలోని ర్యాంపులు రూ.2, రూ.3 మాత్రమే ఇస్తున్న సమయంలో రైతులు కృష్ణగిరి వంటి బయటి ప్రాంతాల్లోని ర్యాంపులకు కాయలు తరలించారు. ఇలా 66వేల టన్నుల కాయల్ని బయటి ప్రాంతాల ర్యాంపుల్లో అమ్ముకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
70వేల టన్నుల కాయల వేస్టేజ్
సుమారు 70వేల టన్నుల కాయలు తొందరపాటు/ఆలస్యంగా కోత వల్ల, కుళ్లిపోవడం వల్ల పాడైపోయాయి. ప్రతి సంవత్సరం వచ్చిన దిగుబడిలో 10 నుంచి 12 శాతం మధ్యలో ఇలాంటి వేస్టేజ్ ఉంటుంది. ఈసారి దిగుబడి అధికంగా ఉండడంతో వేస్టేజ్ కూడా ఎక్కువగా ఉంది. ఇక మిగిలిన 1.48 లక్షల టన్నుల కాయల్ని ప్రాసెసింగ్ చేస్తున్నారు. సుమారు రెండు వారాల్లో ప్రాసెసింగ్ ప్రక్రియ పూర్తవుతుందని తెలుస్తోంది.
Updated Date - Jul 08 , 2025 | 12:20 AM