చివరి కోత వరకు మామిడికి సబ్సిడీ అందిస్తాం
ABN, Publish Date - Jun 18 , 2025 | 01:37 AM
కాయలు పక్వానికి రాకముందే కోయొద్దు రైతులకు కలెక్టర్ వెంకటేశ్వర్ సూచన కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 0877-2236007 ఏర్పాటు
తిరుపతి(కలెక్టరేట్), జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ‘చివరి పంట వరకు మామిడికి సబ్సిడీ అందిస్తాం. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దు. కాయలు పక్వానికి వచ్చాకే కోసి గుజ్జు తయారీ పరిశ్రమకు తీసుకురండి’ అని కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం జేసీ శుభం బన్సల్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు నష్టపోకుండా తోతాపురికి మద్దతు ధర రూ.12గా నిర్ణయించడం జరిగిందని, అందులో ప్రాసెసింగ్ యూనిట్ వారు రూ.8, మరో రూ.4 ప్రభుత్వం సబ్సిడీగా చెల్లిస్తుందన్నారు. చివరి కోత వరకు కూడా రూ.4 సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుందని స్పష్టంచేశారు. మామిడి రైతుల కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను 0877-2236007 నెలంబరులో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. మామిడి గుజ్జు పరిశ్రమల వారు సిండికేట్ అయి రైతులకు అన్యాయం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మామిడి సీజన్ ముగిసే వరకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మామిడి గుజ్జు పరిశ్రమలు, మండీలు, ర్యాంపుల వద్ద అధికారులను నియమించామని, వారు రైతులకు సహకరిస్తారన్నారు. కాగా, ఈ ఏడాది తోతాపురి దిగుబడి పెరగడం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో మామిడి పల్ప్ ఎగుమతి తగ్గడంతో సమస్య తలెత్తిందన్నారు. తమిళనాడు, కర్ణాటకలో మామిడి గుజ్జు పరిశ్రమల నుంచి పార్లే, కోకకోలా, పెప్సీ కంపెనీ వాళ్లు కొన్నారని, దీంతో రెండేళ్లుగా మన జిల్లాలో పరిశ్రమల్లో మామిడి గుజ్జు నిల్వలు ఉండిపోయినట్లు చెప్పారు. గడిచిన వారం నుంచి జిల్లాలో రోజుకు 2వేల టన్నుల చొప్పున తోతాపురి కొనుగోలు జరుగుతోందని, ఇప్పటి వరకు 16వేల టన్నులు ప్రాసెస్ చేశారని వివరించారు. రూ.4 సబ్సిడీ వల్ల ఉమ్మడి జిల్లాలోని రైతులకు రూ.170 కోట్ల లబ్ధి కలగనుందన్నారు. ఈ పంట నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సబ్సిడీ అందుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాశాఖాధికారి ప్రసాదరావు, ఉద్యానవన శాఖ అధికారి దశరథరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 18 , 2025 | 01:37 AM