సూళ్లూరుపేట ‘అమృత్’ రైల్వే స్టేషన్
ABN, Publish Date - May 23 , 2025 | 02:01 AM
అటు షార్.. ఇటు శ్రీసిటి.. మరోవైపు రాష్ట్ర సరిహద్దు. ఇంతటి కీలకమైన సూళ్లూరుపేటలో రైల్వే స్టేషన్ను ‘అమృత్ భారత్’ కింద ఆధునికీకరించారు. రూ.14.50 కోట్లతో కొత్త సొబగులతో, ప్రయాణికులకు అన్ని వసతులతో ఆధునికీకరించిన ఈ రైల్వే స్టేషన్ను గురువారం వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించగా.. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేరుగా ప్రారంభోత్సవం చేశారు.
వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ
సూళ్లూరుపేట, మే 22 (ఆంధ్రజ్యోతి): అటు షార్.. ఇటు శ్రీసిటి.. మరోవైపు రాష్ట్ర సరిహద్దు. ఇంతటి కీలకమైన సూళ్లూరుపేటలో రైల్వే స్టేషన్ను ‘అమృత్ భారత్’ కింద ఆధునికీకరించారు. రూ.14.50 కోట్లతో కొత్త సొబగులతో, ప్రయాణికులకు అన్ని వసతులతో ఆధునికీకరించిన ఈ రైల్వే స్టేషన్ను గురువారం వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించగా.. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేరుగా ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కలెక్టర్ వెంకటేశ్వర్, రైల్వే అధికారులతో కలిసి రైల్వే స్టేషన్ను పరిశీలించారు. చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడతూఊ.. ఒకప్పుడు రైళ్లలో కూర్చోడానికి సీట్లు కూడా ఉండేవి కావని, రైల్వే స్టేషన్లో తాగునీరు వసతి కూడా ఉండేది కాదన్నారు. ఇప్పుడు ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ ప్రధాన కూడలి ప్రాంతాల్లో అవసరమైన చోట అమృత్ భారత్ పథకంతో రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారన్నారు. ఒకప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ ఫండ్తో రైల్వేలో అభివృద్ధి పనులు జరిగేవని గుర్తుచేశారు. పలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుంటోందన్నారు. ఒక తిరుపతి రైల్వేస్టేషన్కే రూ.300 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న దూరదృష్టితో చంద్రబాబునాయుడు బీజేపీతో కలిసి ముందుకెళ్లారన్నారు. ఈ నిర్ణయంతోనే రాష్ట్రానికి నేడు రూ.వేల కోట్లు వస్తున్నాయని తెలిపారు. కాగా, కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే, రైల్వే అధికారులతో కలిసి రైల్వేస్టేషను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్రెడ్డి.. ప్రారంభోత్సవ వేదికిపైకి తనను పిలవలేదని అలిగి వెళ్లిపోయారు. పట్టణ ప్రథమ పౌరుడైన తనను వేదిక పైకి ఆహ్వానించలేదని రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ పిలిచినా, తనకు అవమానం జరిగిందంటూ వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణ రెడ్డి, తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం, ఆర్డీవో కిరణ్మయి, డీఆర్ఎం విశ్వనాథ్ తదితరులున్నారు.
Updated Date - May 23 , 2025 | 02:01 AM