గగనంగా నైరుతి చినుకు
ABN, Publish Date - Jun 19 , 2025 | 01:42 AM
త్తూరుజిల్లాలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. వాతావరణం చల్లగా ఉంటున్నా, మబ్బులు కమ్ముకుంటున్నా నైరుతి చినుకులు కురవడం గగనంగా మారింది.
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): చిత్తూరుజిల్లాలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. వాతావరణం చల్లగా ఉంటున్నా, మబ్బులు కమ్ముకుంటున్నా నైరుతి చినుకులు కురవడం గగనంగా మారింది. ఎండలు మండిపోయిన మార్చి, ఏప్రిల్ నెలల్లో జిల్లావ్యాప్తంగా 16.4 మిమీ సాధారణ వర్షపాతం బదులు 40.4 మి.మీ, మేనెలలో సాధారణ వర్షపాతం 4.5 మిమీ బదులు 158.5 మి.మీ వర్షం కురిసింది. ఎండాకాలంలో వానాకాలంలా వాతావరణం నెలకొనగా, వానాకాలం ప్రారంభమై మూడోవారం ప్రారంభమైనా ఇప్పటికీ వేసవి కాలాన్నే తలపిస్తోంది. తీవ్ర వర్షాభావం నెలకొంది. చినుకు రాలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 31 మండలాల్లో జూన్ నెల సాధారణ వర్షపాతం 80.9 మిమీ కాగా, మంగళవారం నాటికి 33.3 మిమీ మాత్రమే కురిసింది. వానలు దంచేస్తాయి అనుకుని కలలు కన్న రైతాంగం దిగాలు పడుతోంది. అక్కడక్కడా బొటాబొటి చినుకులు తప్ప పంటలకు అనువుగా వర్షాలు కురవడం లేదు. యాదమరి, నిండ్ర మండలాల్లో మాత్రమే సాధారణానికి మించి అధిక వర్షపాతం నమోదుకాగా, ఒక్క మండలంలో సాధారణం, 10 మండలాల్లో లోటు, 18 మండలాల్లో అత్యధిక లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అత్యధిక లోటు వర్షపాతం నమోదైన మండలాల్లో రొంపిచెర్ల, పులిచెర్ల, వెదురుకుప్పం, పూతలపట్టు, ఐరాల, సోమల, చౌడేపల్లి, పుంగనూరు, పెద్దపంజాణి, గంగవరం, తవణంపల్లి, పలమనేరు, బైరెడ్డిపల్లి, వి.కోట, శాంతిపురం, బంగారుపాళ్యం, కుప్పం, రామకుప్పం ఉన్నాయి. ఈ నెలలో రామకుప్పం మండలంలో 69.6 మిమీ వర్షం బదులు చుక్క వాన కూడా కురవకపోవడం విచిత్రం. బంగారుపాళ్యంలో 74.1 మి.మీ బదులు ఇంతవరకు 2.6 మిమీ, చౌడేపల్లిలో 91.1 మిమీ బదులు 4 మిమీ, పలమనేరులో 80.1 బదులు 4 మిమీ వర్షం కురవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది.
Updated Date - Jun 19 , 2025 | 01:42 AM