మహిళా సంరక్షణ కార్యదర్శులకు రీకౌన్సెలింగ్ నిర్వహించాలి
ABN, Publish Date - Jul 02 , 2025 | 02:18 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మహిళా సంరక్షణ కార్యదర్శుల బదిలీలకు రీకౌన్సెలింగ్ నిర్వహించాలని ఆ సంఘం నాయకులు డిమాండు చేశారు.
తిరుపతి(కలెక్టరేట్), జూలై 1(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మహిళా సంరక్షణ కార్యదర్శుల బదిలీలకు రీకౌన్సెలింగ్ నిర్వహించాలని ఆ సంఘం నాయకులు డిమాండు చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. మహిళా సంరక్షణ కార్యదర్శుల సంఘం నాయకురాలు నజమా మాట్లాడుతూ.. చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో చేపట్టిన బదిలీల ప్రక్రియ, నిబంధనలను అనుసరించి జరగలేదని ఆరోపించారు. ఈ బదిలీల ప్రక్రియ సీనియారిటీ జాబితా ప్రామాణికంతో ఖాళీల వివరాలను తెలుపుతూ నిబంధనల ప్రకారం నిర్వహించాలన్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీలలో పనిచేస్తున్న మహిళా కార్యదర్శులను జీవో నెంబరు 6ను పరిగణనలోకి తీసుకుని వార్డు నుంచి వార్డుకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. స్పౌజ్, మెడికల్ కేటగిరి కింద నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగాయని విమర్శించారు. వీటిని పునఃపరిశీలించి రీకౌన్సెలింగ్ చేయాలన్నారు. ఈ నిరసనలో సంఘం నాయకులు ఊర్వశి, జ్ఞానాంబిక, విజయలక్ష్మి, మహిళ సంరక్షణ కార్యదర్శులు, గ్రామ, వార్డు సచివాలయం నాయకుడు కోటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 02 , 2025 | 02:18 AM