Mogili: కమనీయం....మొగిలీశ్వరుడి కల్యాణం
ABN, Publish Date - Mar 02 , 2025 | 02:06 AM
బంగారుపాళ్యం మండలంలోని కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి వార్షిక ఉత్సవాల్లో ఏడవ రోజైన శనివారం పార్వతీపరమేశ్వరుల కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది.
బంగారుపాళ్యం,మార్చి1(ఆంధ్రజ్యోతి): బంగారుపాళ్యం మండలంలోని కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి వార్షిక ఉత్సవాల్లో ఏడవ రోజైన శనివారం పార్వతీపరమేశ్వరుల కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ప్రధాన అర్చకులు గంగాధర గురుకుల్ ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు ఆలయంలోని మూలవిరాట్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ముందుగా సకల విఘ్నాలకు అధిపతైన వినాయకుడికి పూజలు చేసి కల్యాణతంతును ప్రారంభించారు.ఆలయంలోని అలంకార మండపంలో ఉత్సవర్లను పూలతో, స్వర్ణాభరణాలతో అలంకరించి వేదికపై ప్రతిష్టించారు.పండితులు నిర్ణయించిన శుభఘడియల్లో వాయిద్యాలు మోగుతుండగా, వేదమంత్రాల నడుమ శాస్ర్తోక్తంగా కల్యాణోత్సవం ముగిసింది. అర్చకులు స్వామి,అమ్మవారిపై ముత్యాల తలంబ్రాలు పోశారు.చిత్తూరుకు చెందిన న్యాయవాది సావిత్రమ్మ,లోకనాథరెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు.శనివారం ఉదయం పార్వతీపరమేశ్వరులు భృంగివాహనంపై విహరించారు. మొగిలికి చెందిన పాటూరు హిమబిందు,యశ్వంత్ కుమార్, మంజునాథ్ కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. రాత్రి అశ్వవాహనంపై ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు.ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఎంబీ విజయకుమార్,ఈవో మునిరాజ తదితరులు పాల్గొన్నారు.బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఉదయాత్పూర్వం తోపు ఉత్సవం, సాయంత్రం 6 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు.
Updated Date - Mar 02 , 2025 | 02:06 AM