పరిశ్రమల స్థాపన వేగవంతం చేయాలి
ABN, Publish Date - Jul 09 , 2025 | 01:31 AM
చిత్తూరు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగల్విండో పద్ధతిలో అనుమతుల వేగవంతంపై ప్రత్యేకదృష్టి సారించాలని కలెక్టర్ సుమిత్కుమార్ సూచించారు.
కలెక్టర్ సుమిత్కుమార్
చిత్తూరు సెంట్రల్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగల్విండో పద్ధతిలో అనుమతుల వేగవంతంపై ప్రత్యేకదృష్టి సారించాలని కలెక్టర్ సుమిత్కుమార్ సూచించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన అంశంపై మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువతకు ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.8.39 కోట్లతో 547 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ద్వారా ఉత్పత్తులు ప్రారంభించడంతో 1604మందికి ఉపాధి లభించినట్లు వివరించారు. రూ.3494 కోట్లతో 13 పెద్ద, మధ్యమ, రూ.117 కోట్లతో 38 సూక్ష్మ, చిన్న పరిశ్రమల స్థాపనకు సింగిల్విండో పద్ధతిలో అనుమతులు మంజూరుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వీటి ద్వారా 20వేల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటి వరకు సింగిల్ డెస్క్ ద్వారా 532 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 520 ఆమోదించామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. నియోజక, మండల స్థాయిలో పీఎంజీవైపై విస్తృత అవగాహన కల్పించాలని, ఈనెల రెండోవారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు ప్రభుత్వం అమలు చేసే వివిధ యాప్పైన శిక్షణ తరగతులు నిర్వహించాలని పరిశ్రమల జీఎంను ఆదేశించారు. పీఎం విశ్వకర్మ యోజన కింద 2131 యూనిట్లు అనుమతులు మంజూరు చేసి ఇప్పటి వరకు 1843 మందికి లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఎంఎ్సఎంఈ ద్వారా 80 యూనిట్లకు రూ.2.22 కోట్లు సబ్సిడీ మంజూరుకు సిఫార్సు చేశామన్నారు. సమావేశంలో ఇండస్ట్రీస్ జీఎం సూరిబాబు, డిప్యూటీ కమిషన్ ఆఫ్ కమర్షియల్ టాక్స్ శ్రీనివాసరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ వైవీ సుబ్బారావు, ఫెఫ్సియా ప్రతినిధి మధుసూదన్, ఫుడ్ ప్రొసెస్ అసోసియేషన్ ప్రతినిధి గోవిందబాబు తదితరులు పాల్గొన్నారు.
పీపీఈ ద్వారా నందరావు బయోఎనర్జీ ప్లాంట్
జీడీనెల్లూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన నందరావు బయోఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ను కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం కలెక్టరేట్లోని పరిశ్రమలపై నిర్వహించిన సమావేశం నుంచి పవర్పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా వీక్షించారు. రూ.50కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏర్పాటు చేసే ఈ ప్లాంటు రోజువారీ 10 టన్నుల ఎనర్జీని ఉత్పత్తి చేయనున్నట్లు ప్రతినిధులు వివరించారు. దీనిద్వారా 200 మందికి ప్రత్యక్షంగా, వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 01:31 AM