ద్రావిడ వర్శిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు
ABN, Publish Date - Jun 28 , 2025 | 12:53 AM
కుప్పం విద్యార్థులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్ కళాశాలను ద్రావిడ విశ్వవిద్యాలయానికి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కుప్పం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): కుప్పం విద్యార్థులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్ కళాశాలను ద్రావిడ విశ్వవిద్యాలయానికి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ కళాశాల మంజూరైనట్లు విశ్వవిద్యాలయ ఇన్చార్జి రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), సీఎస్ఈ విత్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (ఏఐ అండ్ ఎంఎల్) అనే రెండు కోర్సులు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఒక్కో కోర్సులో 60 సీట్లుంటాయి. కళాశాల మంజూరు కావడంపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్,ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్.మునిరత్నం హర్షం వ్యక్తం చేశారు.ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
తదుపరి లక్ష్యంగా యూజీ, పీజీ, బీఈడీ కళాశాలల అనుబంధం
గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ద్రావిడ విశ్వవిద్యాలయానికి రెండు ముఖ్యమైన కోర్సులతో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడంపట్ల వర్శిటీ ఇన్చార్జి ఉప కులపతి ఎం.దొరస్వామి, రిజిస్ట్రార్ వి.కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తదుపరి లక్ష్యంగా చిత్తూరు జిల్లాలోని యూజీ, పీజీ, బీఈడీ కళాశాలలను వర్శిటీకి అనుబంధంగా తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం ద్రావిడ విశ్వవిద్యాలయానికి అన్నిరకాలుగా మద్దతు ఇస్తున్నదన్నారు.అవుట్ సోర్సింగ్ సిబ్బందికి పెండింగు జీతాలుగా మొదటి దశలో రూ.2.86 కోట్లు, రెండవ దశలో రూ.5.2 కోట్లు విడుదల చేయడంతోపాటు మూడేళ్ల వేతన భరోసా కొనసాగించేందుకు అంగీకరించిందన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్కు,ఏఎపీఎస్సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Jun 28 , 2025 | 01:05 AM