శిరీషకు రూ.5 లక్షల చెక్కు పంపిణీ
ABN, Publish Date - Jun 19 , 2025 | 01:38 AM
కుప్పం పురపాలక సంఘం నారాయణపురంలో అప్పు వసూలుకోసం చెట్టుకు కట్టేసి వేధించిన సంఘటనలో బాధితురాలు శిరీషకు బుధవారం కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్.మునిరత్నం, కడా సలహా మండలి సభ్యుడు డాక్టర్ బీఆర్.సురేశ్బాబు రూ.5 లక్షల విలువ చేసే చెక్కును ప్రభుత్వం తరఫున పంపిణీ చేశారు.
కుప్పం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): కుప్పం పురపాలక సంఘం నారాయణపురంలో అప్పు వసూలుకోసం చెట్టుకు కట్టేసి వేధించిన సంఘటనలో బాధితురాలు శిరీషకు బుధవారం కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్.మునిరత్నం, కడా సలహా మండలి సభ్యుడు డాక్టర్ బీఆర్.సురేశ్బాబు రూ.5 లక్షల విలువ చేసే చెక్కును ప్రభుత్వం తరఫున పంపిణీ చేశారు. నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప అప్పులు చేసి పారిపోగా, ఆయన భార్య శిరీష బెంగళూరులో దొరికిన పని చేసుకుంటూ ముగ్గురు బిడ్డలను పోషించుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం కుమారుడు అభి టీసీకోసం నారాయణపురం వచ్చిన శిరీషను, ఆమెకు రూ.80 వేలు అప్పు ఇచ్చిన అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప, ఆయన భార్య వెంకటమ్మ, కొడుకు రాజా, కోడలు జగదీశ్వరి చెట్టుకు కట్టేసి అమానుషంగా వేధించిన విషయం తెలిసిందే. ఈ దారుణంపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీ మణికంఠను ఆదేశించారు. దీంతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా, జడ్జి వారికి 14 రోజులు రిమాండ్ విధించారు. అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు శిరీషతో, మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మాట్టాడి ఆమె కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. రూ.5 లక్షలు తక్షణ ఆర్థిక సాయంగా ప్రకటించడమే కాక, పిల్లల చదువుల బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శిరీషను, ఆమె ముగ్గురు పిల్లలు మధు, దీక్షిత, అభిలను బుధవారం కడా కార్యాలయానికి పిలిపించారు. శిరీషకు జరిగిన అన్యాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల విలువ గల చెక్కును పంపిణీ చేశారు. ఇదిగాక ముఖ్యమంత్రి సూచనల మేరకు 50 సెంట్ల భూమిని శిరీష కుటుంబానికి ప్రభుత్వం తరఫున త్వరలోనే ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం తరఫున ముగ్గురు పిల్లల విద్యకు అవసరమైన అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ ఇటువంటి అమానుష, దారుణ సంఘటనలు జరుగకుండా శిరీషకు, ఆమె కుటుంబానికి పూర్తి పోలీసు రక్షణ కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కుప్పం మున్సిపల్, మండల అధ్యక్షులు రాజ్కుమార్, ప్రేమ్కుమార్, టీడీపీ నియోజకవర్గ విస్తరణ కమిటీ సభ్యుడు కన్నన్ తదితరులు పాల్గొన్నారు.
--------------------------------------------
Updated Date - Jun 19 , 2025 | 01:38 AM