Amaravati Capital: అమరావతిలో మరో అధ్యాయం
ABN, Publish Date - Apr 26 , 2025 | 04:04 AM
అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అభివృద్ధి ప్రాజెక్టులపై వారితో విస్తృతంగా చర్చించారు. మియావాకీ విధానంతో పచ్చదనం పెంపు, ఉగ్రవాదంపై కఠిన నిర్ణయాలకు మద్దతు వంటి అంశాలపై ప్రధానితో భేటీ సందర్భంగా చర్చించారు.
2న పనుల పునరుద్ధరణ ప్రారంభానికి రండి
ప్రధాని మోదీకి చంద్రబాబు ఆహ్వానం
అంగీకరించిన మోదీ.. ఢిల్లీలో గంట చర్చలు
ప్రపంచ స్థాయి రాజధానికి ప్రధాని సూచనలు
పచ్చదనానికి అధిక ప్రాధాన్యమివ్వండి
మియావకీ పద్ధతులు అమలు చేయండి: మోదీ
కేంద్ర సాయానికి బాబు కృతజ్ఞతలు
ఎన్టీపీసీ గ్రీన్, ఆర్సెలర్, బీపీసీఎల్ ప్రాజెక్టులు
మంజూరు చేసినందుకు ధన్యవాదాలు
ఉగ్ర పోరులో అండగా ఉంటామని హామీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ‘అద్భుతమైన భవిష్యత్ దిశగా రాష్ట్రం జరిపే ప్రయాణంలో అమరావతి చరిత్రాత్మక మైలురాయి అవుతుంది. ఈ ప్రత్యేక ఘట్టాన్ని ప్రారంభించేందుకు, రాష్ట్రాభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి అమరావతికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించాను. ఆయన అంగీకరించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి ఆయన పలు సూచనలు కూడా చేశారని వెల్లడించారు. చంద్రబాబు శుక్రవారం ఢిల్లీలో ప్రధానితో సమావేశమయ్యారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరూ దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. రాజధాని నగర నిర్మాణం చేపడుతున్న తీరును, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిని, విశాఖ ఉక్కు కర్మాగారం పనితీరును వివరించారు.
రాజధాని పనులు ప్రారంభించేందుకు తాను తప్పకుండా వస్తానని చెప్పిన మోదీ.. రాజధానిని వేగవంతంగా నిర్మించేందుకు పలు సూచనలు చేశారు. దేశంలో అనేక మౌలిక సదుపాయాలను తన ప్రభుత్వం ఎంత వేగంగా నిర్మించిందో సీఎంకు తెలియజేశారు. అమరావతిలో పచ్చదనం పెంచేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. జపాన్ వన్య శాస్త్రవేత్త అకిరా మియావకీ అనుసరించిన అటవీ మొక్కల పెంపకం పద్ధతులను అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా పట్టణాల్లో స్వయం ఆధారిత సాంద్ర అడవులను పెంచేందుకు మియావాకీ సహజ అటవీ విధానాలు తోడ్పడతాయని, జీవ వైవిధ్యానికి కూడా ఉపయోగమని పేర్కొన్నారు.
నిరంతర సాయానికి ధన్యవాదాలు..
ప్రధానిని కలిసి వచ్చాక చంద్రబాబు ‘ఎక్స్’లో వివరాలు పంచుకున్నారు. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించేందుకు మోదీ దూరదృష్టితో కూడిన సూచనలు చేశారని, వాటిని అమలు చేస్తామన్నారు. ‘రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న నిరంతర సహాయానికి ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాను. అలాగే ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంటుకు మద్దతిచ్చినందుకు.. బీపీసీఎల్ రిఫైనరీ మంజూరు చేసినందుకు, ఇందులో ఆరాంకో భాగస్వామ్యాన్ని ఖరారు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశాను. ఈసారి రాష్ట్ర పర్యటనలో శ్రీశైలాన్ని కూడా సందర్శించాలని కోరాను’ అని వివరించారు. ఏపీ పర్యటన సందర్భంగా ప్రధాని ప్రకటించాల్సిన అభివృద్ధి పథకాల గురించి కూడా వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
ఉగ్రవాదులకు గట్టిగా జవాబివ్వాలి: బాబు
పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి తమకు తీవ్ర ఆందోళన కలిగించిందని, ఉగ్రవాదులకు గట్టి సమాధానమిచ్చి తీరాలని చంద్రబాబు ప్రధానితో అన్నారు. ఉగ్రవాదంపై పోరులో రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం కేంద్రానికి అండగా నిలుస్తారని.. ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పేందుకు తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 26 , 2025 | 04:04 AM