నిర్లక్ష్యమేల..
ABN, Publish Date - Apr 25 , 2025 | 01:17 AM
జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన గురువారం జరిగిన జిల్లా సమీక్ష సమావేశం వాడీవేడిగా సాగింది. సాగు నీటి కాలువలను నిర్లక్ష్యం చేస్తున్న నీటిపారుదలశాఖ అధికారులపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమైన సమావేశాలు తన నియోజకవర్గంలో జరుగుతున్నా తనకు సమాచారం ఇవ్వడంలేదని అధికారుల తీరుపై ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అసహనం వ్యక్తం చేశారు. బుడమేరులో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆధారాలు చూపినా అడ్డుకోవడంలేదని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా పలువురు ప్రజాప్రతినిధులు తమ సమస్యలు సభ దృష్టికి తెచ్చారు.
- వాడీవేడిగా జిల్లా సమీక్ష సమావేశం
- సాగునీటి కాలువలపై ఎస్ఈని నిలదీసిన మంత్రి రవీంద్ర
- అధికారుల తీరు మారడంలేదన్న ప్రభుత్వ విప్ యార్లగడ్డ
- ఆధారాలు చూపినా మట్టి తవ్వకాలు ఆపడంలేదన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్
- పలు సమస్యలను సభ దృష్టికి తెచ్చిన ప్రజాప్రతినిధులు
- అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తే నిధులు తెస్తామన్న మంత్రులు సుభాష్, కొల్లు
జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన గురువారం జరిగిన జిల్లా సమీక్ష సమావేశం వాడీవేడిగా సాగింది. సాగు నీటి కాలువలను నిర్లక్ష్యం చేస్తున్న నీటిపారుదలశాఖ అధికారులపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమైన సమావేశాలు తన నియోజకవర్గంలో జరుగుతున్నా తనకు సమాచారం ఇవ్వడంలేదని అధికారుల తీరుపై ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అసహనం వ్యక్తం చేశారు. బుడమేరులో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆధారాలు చూపినా అడ్డుకోవడంలేదని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా పలువురు ప్రజాప్రతినిధులు తమ సమస్యలు సభ దృష్టికి తెచ్చారు.
ఆంఽధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లా పరిషత సమావేశపు హాలులో జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. వివిధ శాఖలపై లోతుగా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఉపయోగపడే పనులకు సంబంధించి పూర్తిస్థాయిలో నివేదికలు అందిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతానని చెప్పారు. అభివృద్ధి పనుల్లో, తలసరి ఆదాయంలో రాష్ట్రలోనే ్ణజిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ నేతృత్వంలో జిల్లా మరింతగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులు ఇబ్బందులు పడకుండా పంట కాలువలు, డ్రెయినేజీలకు త్వరితగతిన మరమ్మతులు చేయించాలన్నారు.
క్షేత్రస్థాయిలో పర్యటించరా!
-నీటిపారుదలశాఖ ఎస్ఈపై మంత్రి రవీంద్ర ఆగ్రహం
నీటి పారుదలశాఖపై జరిగిన సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర నీటి పారుదలశాఖ ఎస్ఈపై ప్రశ్నల వర్షం కురింపించారు. కాలువల పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పర్యటించకుండా విజయవాడకే పరిమితమైతే ఎలాగని ప్రశ్నించారు. బందరు కాలువకు కంకిపాడు వద్ద లాకులు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాడపాలెం, బంటుమిల్లి తదితర ప్రాంతాల్లో పంట కాలువలు, డ్రెయినేజీలను పరిశీలించారా.. ఎన్ని ప్రాంతాల్లో పర్యటించారు.. ఏం గమనించారో చెప్పాలని మంత్రి నిలదీశారు. కాలువల నిర్వహణ పనులు చేసే కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కై పనులు చేయకుండానే బిల్లులు చేసేస్తున్నారని ఆరోపించారు. బందరు మండలం చిన్నాపురం సమీపంలో గుండేరు డ్రెయిన్పై ఉన్న పాతవంతెన కూలిపోవడంతో అక్కడ గుర్రపుడెక్క, నాచు పేరుకుపోయి నీటి ప్రవాహం నిలిచిపోతోందన్నారు. ఎగువ ప్రాంతంలోని పొలాలు భవిష్యత్తులో మునిగిపోతే అధికారులే బాధ్యత వహించాలని చెప్పారు. జూన్ నెలాఖరులోగా పంట కాలువలు, డ్రెయినేజీలలో పూడికతీత పనులు చేయాలని, ఇందుకు అవసరమై నివేదికలను తయారు చేస్తే, అదనంగా నిధులు కావాల్సివస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తాను వెళ్లి నిధులు విడుదల చేయాలని కోరతానని మంత్రి కొల్లు వివరించారు.
అధికారుల తీరు మారాల్సిందే! : ప్రభుత్వ విప్ యార్లగడ్డ
జిల్లాలోని అధికారులు పనితీరు మార్చుకోవాలని ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మే 2వతేదీన ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన సమావేశాలను గన్నవరంలో నిర్వహిస్తున్న అధికారులు స్థానిక శాసన సభ్యుడినైన తనకు కనీస సమాచారం ఇవ్వడంలేదన్నారు. కేసరపల్లి, గన్నవరంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయనే అంశంపై ప్రజలు ఫిర్యాదు చేస్తే వాటిని ఏ కారణంతో అధికారులు స్వాధీనం చేసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. గన్నవరం ఎయిర్పోర్టు కృష్ణాజిల్లాలోనే ఉంటే ఎన్టీఆర్ జిల్లా అధికారుల పాలన అక్కడ ఎందుకు కొనసాగిస్తున్నారని నిలదీశారు. ఎయిర్పోర్టు నుంచి వస్తుంటే కేసరపల్లి వద్ద రెండు వంతెనలకు రెయిలింగ్ కూడా లేకుండా వెక్కిరిస్తూ కనపడుతున్నాయని, వీఐపీలు ఈ వంతెనల స్థితిని చూసి ఏమనుకుంటారని ప్రశ్నించారు. జిల్లాకు సాగునీరు ఏ తేదీన విడుదల చేస్తారో, కాలువల మరమ్మతులు ఎప్పుడు పూర్తి చేస్తారో అధికారులే చెప్పాలని అన్నారు. ఏలూరుపాడు వద్ద పంట కాలువ గట్టు బలహీనంగా ఉందని, పెరికీడు వద్ద కాలువలో పూడికతీత పనులు చేయాలని, ఎప్పటిలోగా చేస్తారని ఆయన ప్రశ్నించారు. గన్నవరం నియోజకవర్గంలోని 54 పంచాయతీలలో భూమి సర్వేకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మట్టి అక్రమ రవాణాను అరికట్టకుంటే ఎలా? : రావి
నందివాడ మండలం చేదుర్తిపాడు సమీపంలో బుడమేరులో పూడికతీత పేరుతో గట్టును కూడా తవ్వేస్తున్నారని, ఈ అంశంపై డ్రెయినేజీ విభాగం అఽధికారులకు తాను ఫిర్యాదు చేస్తే అధికారులు ఏకంగా అనుమతులే ఇచ్చారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు అన్నారు. పూడికతీత పనులు కాలువలో చేస్తారని, అది కూడా అడుగు, అడుగున్నర లోతున మట్టిని తీస్తారని, కానీ లోతుగా కాలువలో మట్టిని తవ్వడంతోపాటు గట్టును సైతం తవ్వేసి రాత్రివేళల్లో టిప్పర్ల ద్వారా తరలించుకుపోతున్నారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రద్దయిన పనులకు గత నెల 25వతేదీన డ్రెయినేజీ అధికారులు అనుమతులు ఇస్తే, అంతకు రెండు రోజుల ముందుగానే మట్టిని తవ్వి విక్రయించే పనులను అక్రమార్కులు ప్రారంభించారన్నారు. మట్టి అక్రమ రవాణా విషయంపై ఎస్పీకి తాను పూర్తి వివరాలతో, పొటోలు కూడా పంపానని, అయినా మట్టి అక్రమ తవ్వకాలు, విక్రయాలు ఆగలేదని, ఇదేం పద్ధతని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ చేదుర్తిపాడులో మట్టి తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, సీసీ కెమెరాలతో, డ్రెయినేజీ విభాగం సిబ్బందితో నిఘా ఏర్పాటు చేస్తామని అన్నారు.
కనీస సమాచారం ఇవ్వడం లేదు : వర్ల
మొవ్వ మండలంలో దేవదాయశాఖ ఆధ్వర్యంలో కట్టిన కల్యాణ మండపం ప్రారంభోత్సవ సమాచారం తనకు ఇవ్వలేదని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్రాజా అన్నారు. నియోజకవర్గంలో నూతనంగా రహదారుల నిర్మాణం జరిగిన విషయాన్ని కూడా తనకు తెలియజేయకుండా ఆర్అండ్బీ అధికారులు గోప్యత పాటిస్తున్నారని చెప్పారు. పామర్రు నియోజకవర్గంలో కృష్ణానదీ గర్భంలో పలు గ్రామాలు ఉన్నాయని, నదికి భారీగా వరదలు వచ్చిన సమయంలో ప్రజలను బయటకు తీసుకువచ్చేందుకు అప్పటికపుడు పడవల ఏర్పాటు కష్టంగా మారిందని, స్థానికులకు పడవలు అందించాలని ఆయన కోరారు.
ఆక్వాజోన్ పరిధిని పెంచండి : కాగిత
గత వైసీపీ ప్రభుత్వంలో ఆక్వాజోన్ పేరుతో రొయ్యల చెరువులకు విద్యుత రాయితీని గణనీయంగా తగ్గించారని, తీర ప్రాంతంలోని అన్ని రొయ్యల చెరువులను ఆక్వాజోన్ పరిధిలోకి చేర్చి విద్యుత రాయితీని అమలు చేయాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కొద్ది రోజుల్లోనే అన్ని రొయ్యల చెరువులకు విద్యుత రాయితీని అమలు చేస్తామని మంత్రులు సుభాష్, రవీంద్ర హామీ ఇచ్చారు. పంటల బీమా పథకంపై రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధికారులను కోరారు. మొక్కజొన్న, మినుము కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఆయిల్ఫాం, ఉద్యాన పంటల సాగును పెంచేందుకు, వరికోతల సమయంలో ధాన్యం ఆరబెట్టేందుకు డ్రయ్యర్లను రైతులకు అందించేందుకు, వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ కల్పలత, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Apr 25 , 2025 | 01:17 AM