బెజవాడ బళ్లు.. ఏవోబీలో రయ్.. రయ్!
ABN, Publish Date - May 31 , 2025 | 01:11 AM
విజయవాడలో ఇటీవలి కాలంలో వరుసగా ద్విచక్ర వాహనాలు మాయమవుతున్న ఘటనల్లో సంచలన విషయం బయటపడింది. కొన్ని గ్యాంగ్లు నగరంలోని పలు చోట్ల బైకులను చోరీ చేసి, ఆ తర్వాత వాటిని వివిధ మార్గాల ద్వారా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) కొండలకు తరలించి.. అక్కడ గంజాయి కోసం అమ్మేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగలు ఖరీదైన బైకులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. కొండలపైన ఇళ్లు ఉన్న వాళ్లు కింద ఉన్న మెట్లు, ర్యాంపుల వద్ద నిలిపి ఉంచిన బైకులపై ఎక్కువగా కన్నేస్తున్నారు. ఇటీవల పోలీసులు చేధించిన బైక్ల చోరీ కేసుల్లో ఎక్కువగా గంజాయి లింక్లు బయటపడ్డాయి.
-గంజాయి కోసం బైకులు దొంగిలిస్తున్న ముఠాలు
-నగరంలో వరుసగా ద్విచక్రవాహనాల చోరీ
-ఏవోబీ కొండ ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మకం
-ఈ ఏడాది విజయవాడలో 185 బైకుల చోరీ
-వాటిల్లో గంజాయి కోసం 35-40
-విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
విజయవాడలో ఇటీవలి కాలంలో వరుసగా ద్విచక్ర వాహనాలు మాయమవుతున్న ఘటనల్లో సంచలన విషయం బయటపడింది. కొన్ని గ్యాంగ్లు నగరంలోని పలు చోట్ల బైకులను చోరీ చేసి, ఆ తర్వాత వాటిని వివిధ మార్గాల ద్వారా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) కొండలకు తరలించి.. అక్కడ గంజాయి కోసం అమ్మేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగలు ఖరీదైన బైకులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. కొండలపైన ఇళ్లు ఉన్న వాళ్లు కింద ఉన్న మెట్లు, ర్యాంపుల వద్ద నిలిపి ఉంచిన బైకులపై ఎక్కువగా కన్నేస్తున్నారు. ఇటీవల పోలీసులు చేధించిన బైక్ల చోరీ కేసుల్లో ఎక్కువగా గంజాయి లింక్లు బయటపడ్డాయి. విజయవాడ నగరం, ఎన్టీఆర్ జిల్లాలో దొంగిలించిన వాహనాలను గంజాయి కోసం తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం ఇలాంటి 20-25 గ్యాంగ్లు ఉన్నట్టు లెక్కలు తీశారు. నగరంలోని భవానీపురం, కొత్తపేట, చిట్టినగర్, మాచవరంలలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. కొండలపై ఇళ్లను నిర్మించుకున్న వారు వాహనాలను కింద ఉన్న మెట్లు, ర్యాంపుల వద్ద పెట్టుకుంటారు.
హ్యాండిల్ లాక్లను విరగ్గొటి..
గంజాయి కావాల్సినప్పుడల్లా దొంగలకు డబ్బుల కంటే ముందు బైక్లు కనిపిస్తున్నాయి. బైక్లను మాయం చేయడానికి ముందు రోజు రాత్రి నగరంలో తిరుగుతూ ఇళ్ల బయట, వీధుల్లో రోడ్ల పక్కన నిలిపి ఉంచిన వాహనాల నుంచి పెట్రోలు దొంగిలిస్తున్నారు. ఆ మర్నాడు రాత్రి అసలు వేటకు బయలుదేరి.. ఎంచుకున్న ప్రాంతాల్లో ఖరీదైన బైక్లను మాయం చేస్తున్నారు. హ్యాండిల్ లాక్లను విరగ్గొట్టి, కొంతదూరం బైక్లను తోసుకుని వెళ్లారు. అక్కడ వైర్ల సాయంతో ఇంజిన్ను స్టార్ట్ చేసుకొని ఇళ్ల వద్దకు వెళ్లిపోతారు. ఆ తర్వాత పెట్రోలు బాటిళ్లను బ్యాగ్లో పెట్టుకుని పర్యాటకులు మాదిరిగా రెండు బైక్లపై ఇద్దరు చొప్పున ఒడిశా ప్రాంతానికి పయనమవుతున్నారు.
పలు మార్గాల ద్వారా సరిహద్దులు దాటి..
చోరీ గ్యాంగ్లు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మోతుగూడెం, సీలేరు, డొంకరాయి వైపుగా ఒడిశా సరిహద్దులకు వెళ్తున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా అల్లూరి జిల్లాలోని సీలేరు సరిహద్దులు దాటుతున్నారు. కొంతమంది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి గోకవరం, రంపచోడవరం, మారేడుమిల్లి, తులసిపాక, మోతుగూడెం మీదుగా సీలేరు సరిహద్దులు దాటుతున్నారు. డొంకరాయి-సీలేరుకు మధ్య 16-18 వరకు గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ ఒడిశా సరిహద్దుల్లో కొండలపై ఉంటాయి. దొంగలు సరిహద్దులు దాటిన తర్వాత పర్యాటకుల్లా మారిపోతున్నారు. ఒకరోజు రాత్రంతా అక్కడి అడవుల్లో ఎంజాయ్ చేస్తూ గంజాయి ఏజెంట్ల గురించి వాకబు చేస్తున్నారు. ఏజెంట్లు చెప్పే ధరలను బట్టి లెక్కలు వేసుకుని ఒక బైక్ను వారికి ఇచ్చేస్తున్నారు. 5-10 కిలోల వరకు గంజాయిని కొనుగోలు చేస్తున్నారు. పని పూర్తయిన తర్వాత మరో బైక్పై తిరుగు ప్రయాణమవడం జరుగుతున్న తంతుగా ఉంది.
ఈ ఏడాది 185 బైకులు మాయం
ఈ ఏడాది ఇప్పటి వరకు విజయవాడలో మొత్తం 365 చోరీలు జరిగాయి. ఇందులో 185 బైక్లు మాయమయ్యాయి. పోలీసులు గంజాయి గ్యాంగ్లను అదుపులోకి తీసుకుని విచారించగా.. 35-40 బైక్లను ఒడిశా సరిహద్దుల్లోని కొండలపై గుర్తించారు. గంజాయిని తీసుకొచ్చేటప్పుడు మార్గమధ్యలో ఎక్కడైనా పోలీసులకు చిక్కితే దొంగలు అక్కడే బైక్ను వదిలేస్తున్నారు. పోలీసు చెక్పోస్టులు దాటుకుని జిల్లాకు చేరుకున్న తర్వాత ఆ వాహనానికి నకిలీ రికార్డులు తయారు చేసి, కాలేజీ విద్యార్థులకు తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. లేకుంటే ఇతర జిల్లాల్లోని శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి తుప్పల్లో పడేస్తున్నారు.
‘జీపీఎస్ ట్రాకర్’ డ్రైవ్ చేపట్టాం
కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న బైక్ల దొంగతనాలపై దృష్టి పెట్టినప్పుడు గంజాయి వ్యవహారాలు కనిపించాయి. ఇక్కడ దొంగిలించిన బైక్లను ఒడిశా సరిహద్దుల్లోకి తీసుకెళ్లి అమ్మేస్తున్నారు. ఆ డబ్బులకు గంజాయిని తెచ్చుకుంటున్నట్టు గుర్తించాం. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఇళ్లల్లో బైక్లను పార్కింగ్ చేసుకొనే పరిస్థితి లేదు. అందుకోసమే బైక్లకు జీపీఎస్ ట్రాకర్ ఏర్పాటు చేయించుకోవాలని వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా విజయవాడలో కొండ ప్రాంతాలపై నివసిస్తున్న వారి బైక్లకు జీపీఎస్ ఏర్పాటు చేయిస్తున్నాం. కొత్తగా ఆర్ఎఫ్ఐడీ(రేడియల్ ఫ్రీకెన్సీ ఐడెంటిఫికేషన్) స్టిక్కర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. అని బైక్ షోరూంలకు నోటీసులు ఇచ్చాం. కొత్తగా విక్రయించే బైక్లకు జీపీఎస్ ట్రాకర్ అమర్చాలని తెలియజేశాం. బైక్లను పార్క్ చేసేటప్పుడు సీసీ కెమెరాల్లో కనిపించేలా పెట్టాలని వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం.
-ఎస్వీ రాజశేఖరబాబు, పోలీసు కమిషనర్
Updated Date - May 31 , 2025 | 01:11 AM