బాలికపై అత్యాచారం కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు, రూ.25 వేలు జరిమానా
ABN, Publish Date - Jun 18 , 2025 | 06:45 AM
ఓ బాలికపై అత్యాచారం కేసులో కర్నూలు జిల్లా పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. నంద్యాల జిల్లా వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో బాలికను గర్భవతిని చేసిన నిందితుడిపై నేరం రుజువు కావడంతో 20 ఏళ్లు కారాగార శిక్ష, రూ.25వేలు జరిమానా విధిస్తూ...
కర్నూలు పోక్సో కోర్టు తీర్పు
కర్నూలు లీగల్, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ఓ బాలికపై అత్యాచారం కేసులో కర్నూలు జిల్లా పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. నంద్యాల జిల్లా వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో బాలికను గర్భవతిని చేసిన నిందితుడిపై నేరం రుజువు కావడంతో 20 ఏళ్లు కారాగార శిక్ష, రూ.25వేలు జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు న్యాయాధికారి రాజేంద్రబాబు మంగళవారం తీర్పు చెప్పారు. వెలుగోడు పోలీసుల చార్జ్షీటు మేరకు మండల పరిధిలోని ఓ గ్రామంలో బాధితురాలు 9వ తరగతి చదువుకునేది. ఆమె తండ్రి మృతి చెందడంతో తల్లి కూలి పనికి వెళ్లేది. 2022 జూలై 14వ తేదీన బాధితురాలు తనకు కడుపు నొప్పి వస్తోందని తల్లికి చెప్పడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆరునెలల గర్భవతి అని తెలపడంతో చికిత్స చేయించుకోకుండానే గ్రామానికి వెనుదిరిగారు. గ్రామానికి వచ్చిన తర్వాత తల్లి బాలికను నిలదీయడంతో అదే వీధిలో ఉండే తెలుగు గంగాధర్ తనకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు అత్యాచారం చేశాడని వాపోయింది. దీంతో బాధితురాలి తల్లి వెలుగోడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి ఆత్మకూరు ఇన్చార్జి డీఎస్పీ సి.మహేశ్వరరెడ్డి పోక్సో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బాధితురాలికి ఒక మగశిశువు పుట్టి మృతి చెందాడు. శిశువు రక్త నమూనాలు సేకరించిన పోలీసులు డీఎన్ఏ టెస్టుకు పంపించారు. ఆ నమూనాలు నిందితుడి డీఎన్ఏతో సరిపోయాయని పోలీసులు కోర్టుకు నివేదించారు. నేరం రుజువు కావడంతో ముద్దాయికి 20 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.25 వేలు జరిమానా విధిస్తూ న్యాయాధికారి రాజేంద్రబాబు తీర్పు చెప్పారు. అదే విధంగా రూ.25 వేలు బాధితురాలికి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది.
Updated Date - Jun 18 , 2025 | 06:46 AM