Education Department: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
ABN, Publish Date - Aug 02 , 2025 | 05:11 AM
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు టీచర్లను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 8వ తేదీ వరకు ఆన్లైన్, ఆఫ్లైన్లో ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి ‘ఉత్తమ ఉపాధ్యాయ’ అవార్డులకు టీచర్లను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 8వ తేదీ వరకు ఆన్లైన్, ఆఫ్లైన్లో ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అదేవిధంగా అవార్డులకు సంబంధించిన విధివిధానాలపై మార్గదర్శకాలు జారీ చేసింది. సెప్టెంబరు 5న నిర్వహించే గురుపూజోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన టీచర్లకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మోడల్ స్కూల్స్, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాలు, కేజీబీవీలు, డైట్ కాలేజీలు, ఏపీ గురుకులాల మేనేజ్మెంట్లలోని టీచర్లకు ఈ అవార్డులు ఇస్తారు. ఈసారి మూడు విధానాల్లో ఉత్తమ టీచర్లను ఎంపిక చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ సూచించిన 14 కేటగిరీల్లో సాధించిన ఫలితాల ఆధారంగా టీచర్లు వ్యక్తిగతంగా అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోని ఉపాధ్యాయుల పేరును ఐదుగురు టీచర్లు అవార్డు కోసం సిఫారసు చేయవచ్చు. ఆగస్టు 1 నుంచి 8 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ నెల 21 నుంచి 23 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి, 25న తుది జాబితా ఖరారు చేస్తారు.
Updated Date - Aug 02 , 2025 | 05:12 AM