AP High Court: ఠాణాల క్షేత్రస్థాయి పరిశీలనకు అడ్వొకేట్ కమిషనర్
ABN, Publish Date - Jul 23 , 2025 | 06:02 AM
స్టేషన్ మొత్తం కనిపించేలా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సర్టిఫై చేస్తూ ఎస్డీపీవోలు(డీఎస్పీలు) నివేదిక ఇచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను...
ఏసీగా లాయర్ ఎంఆర్కే చక్రవర్తి నియామకం
తనిఖీ కోసం పిటిషనర్ 6 పోలీస్ స్టేషన్లను సూచిస్తారు
సీసీ కెమెరాలు సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా తేల్చాలి
పిల్పై ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు ధర్మాసనం
అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): స్టేషన్ మొత్తం కనిపించేలా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సర్టిఫై చేస్తూ ఎస్డీపీవోలు(డీఎస్పీలు) నివేదిక ఇచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను తేల్చేందుకు న్యాయవాది ఎంఆర్కే చక్రవర్తిని అడ్వొకేట్ కమిషనర్గా నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ సూచించిన ఆరు స్టేషన్లలో పర్యటించి సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా? లేదా? పరిశీలించి నివేదిక ఇవ్వాలని అడ్వొకేట్ కమిషనర్ను ఆదేశించింది. స్టేషన్లో మొత్తం ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు? అవన్నీ పనిచేస్తున్నాయా? ఫుటేజ్ స్టోర్ అవుతోందా? స్టేషన్ మొత్తం కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా? వంటి విషయాలను నివేదికలో పొందుపర్చాలని పేర్కొంది. తనిఖీల నిమిత్తం స్టేషన్కు వచ్చిన అడ్వొకేట్ కమిషనర్కు సహకరించాలని ఆయా జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, ఏసీలు, డీఎస్పీలు, ఎస్హెచ్వోలకు తేల్చిచెప్పింది. విచారణను ఆగస్టు 12కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ జగడం సుమతితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 2019లో న్యాయవాది తాండవ యేగేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు ధర్మాసనం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2019 జూలై 15న ఆదేశాలిచ్చిం ది. ఏళ్లు గడుస్తున్నా ఉత్తర్వులు అమలుకాకపోవడంతో యోగేశ్ 2022లో కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పల్నాడు జిల్లా, మాచవరం పోలీసులు తన సోదరుడు గోపిరాజును అక్రమంగా నిర్బంధించారంటూ కటారు నాగరాజు గత ఏడాది నవంబరులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్లు ఇటీవల విచారణకు రాగా స్టేషన్ మొత్తం కనిపించేలా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సర్టిఫై చేస్తూ ఎస్డీపీవోలు(డీఎస్పీలు) సమర్పించిన నివేదికలపై ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తేల్చేందుకు అడ్వొకేట్ కమిషనర్ను నియమిస్తామని, కొన్ని స్టేషన్ల పేర్లు సూచించాలని పిటిషనర్ను ఆదేశించింది. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు రాగా న్యాయవాది తాండవ యోగేశ్ స్పందిస్తూ... వివిధ ఎస్డీపీవోల పరిధిలోకి వచ్చే 12 రాణాల పేర్లను కోర్టు ముందు ఉంచామన్నారు.
Updated Date - Jul 23 , 2025 | 06:02 AM