AP Government: కొత్త పరిశ్రమలకు రాయితీలు
ABN, Publish Date - Jul 28 , 2025 | 05:29 AM
రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు స్థాపించనున్న పలు కంపెనీలకు ప్రభుత్వం భూకేటాయింపులు, ఇతర ప్రోత్సాహకాలు ప్రకటించింది. ప్రోత్సాహకాల ప్యాకేజీ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పేపర్, ఫార్మా, సోలార్ కంపెనీలకు ప్యాకేజీ
అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు స్థాపించనున్న పలు కంపెనీలకు ప్రభుత్వం భూకేటాయింపులు, ఇతర ప్రోత్సాహకాలు ప్రకటించింది. ప్రోత్సాహకాల ప్యాకేజీ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.3,700 కోట్ల పెట్టుబడితో 1,200 మందికి ఉపాధి కల్పించే 6 గిగావాట్ల ఫొటోవోల్టాయిక్ ఇంగోట్-వేపర్ తయారీ కర్మాగారాన్ని రీన్యూ ఫొటోవోల్టాయిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేయనుంది. వచ్చే జనవరి-మార్చి నెలల మధ్య నిర్మాణ పనులు ప్రారంభించి 2028 కల్లా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రతిపాదనలు సమర్పించింది. దీంతో రాంబిల్లి వద్ద 135.96 ఎకరాల భూమిని (నీటి వనరులను మినహాయించి) ఎకరానికి రూ.66 లక్షల రాయితీ రేటుకు ప్రభుత్వం కేటాయించింది. స్థిర మూలధన పెట్టుబడిపై 30 శాతం రాయితీని ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి పదేళ్లలో అందజేయనుంది. యూనిట్కు ఒక రూపాయి చొప్పున విద్యుత్తు టారిఫ్ రీయింబర్స్మెంట్ (రూ.354.17 కోట్లకు మించకుండా), ఐదేళ్ల పాటు విద్యుతు సుంకం పూర్తిగా మినహాయింపు, నీటి చార్జీలలో 25 శాతం (రూ.87.60 కోట్లకు మించకుండా) తిరిగి చెల్లింపు, పారిశ్రామిక వినియోగం, టౌన్షిప్, ఇతర కార్యకలాపాల కోసం భూమి కొనుగోలుపై స్టాంప్డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, బదిలీ సుంకం పూర్తిగా మినహాయింపు, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పీఎల్ఐ ప్రోత్సాహకంపై 10 శాతం (రూ.140 కోట్లకు మించకుండా) టాప్అప్ ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనుంది. ఇంకా అవసరమైన ఇతర సౌకర్యాలు, ఆమోదాలు, అనుమతులను సులభతరం చేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తితో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
తిరుపతి జిల్లా నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్లో 1475 మందికి ఉపాధి కల్పిస్తూ రూ.1147.05 కోట్ల పెట్టుబడితో గ్రీన్లామ్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేయనున్న హై-ప్రెజర్ లామినేట్, ఉడ్ బేస్డ్ పార్టికల్ బోర్డ్ తయారీ కర్మాగారానికి (2, 3 దశలు పూర్తిచేయడానికి) ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని ప్రకటించింది.
తిరుపతి జిల్లా శ్రీసిటీలో రూ.1358 కోట్ల పెట్టుబడితో 1770 మందికి ఉపాధి కల్పనతో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించిన ఎక్స్లెంట్ ఫార్మా సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్లో 5 గిగా వాట్ల సోలార్ మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ను ప్రకటించింది. రూ.6,933.11 కోట్ల పెట్టుబడితో 2028 నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి 2,138 మందికి ఉపాధి కల్పిస్తామంటూ ఆ సంస్థ ప్రతిపాదనలు సమర్పించింది.
Updated Date - Jul 28 , 2025 | 05:30 AM