Mining Scam: క్వార్ట్జ్కేసులో అనిల్యాదవ్ పేరు
ABN, Publish Date - Jul 23 , 2025 | 03:28 AM
నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్కుమార్ యాదవ్ను పోలీసులు నిందితుడిగా చేర్చినట్లు తెలిసింది. ఈ కేసులో ఏ12గా ఉన్న ఆయన అనుచరుడు, వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్రెడ్డిని...
అనుచరుడు శ్రీకాంత్రెడ్డి అరెస్టు.. వాంగ్మూలం
కాకాణి, అనిల్తో కలిసి అక్రమ మైనింగ్ చేశా
‘క్వార్ట్జ్’ డబ్బులతో నేను, అనిల్ వెంచర్లు వేశాం
విచారణలో వెల్లడించిన బిరదవోలు శ్రీకాంత్రెడ్డి
మాజీ మంత్రిని నిందితుడిగా చేర్చిన పోలీసులు!
నెల్లూరు, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్కుమార్ యాదవ్ను పోలీసులు నిందితుడిగా చేర్చినట్లు తెలిసింది. ఈ కేసులో ఏ12గా ఉన్న ఆయన అనుచరుడు, వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్రెడ్డిని పోలీసులు హైదరాబాద్లో సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ఆయన్నుంచి కీలక ఆధారాలను సేకరించారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల వ్యవహారంలో అనిల్కుమార్కు ప్రమేయం ఉందని శ్రీకాంత్రెడ్డి వెల్లడించినట్టు తెలిసింది. దీని ఆధారంగా.. అనిల్ పేరును కూడా కేసులో చేర్చినట్టు తెలిసింది. అనంతరం శ్రీకాంత్రెడ్డిని గూడూరు కోర్టుకు హాజరుపరిచి రిమాండ్పై జైలుకు తరలించారు. కాగా, శ్రీకాంత్రెడ్డి అరెస్టు సందర్భంగా రికార్డు చేసిన మహాజరునామా(వాంగ్మూలం) సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అందులో ఏముందంటే.. ‘‘మాజీ మంత్రులు కాకాణి గోవర్దన్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్లకు నేను ముఖ్య అనుచరుడిని. వారి వ్యాపార లావాదేవీల్లో పాల్గొన్నాను. క్వార్ట్జ్కు మంచి డిమాండ్ ఉండడంతో నెల్లూరు జిల్లా పొదలకూరు, సైదాపురం, తిరుపతి జిల్లా గూడూరు ప్రాంతాల్లో క్వార్ట్జ్ను అనధికారికంగా తవ్వాలని నేను, గోవర్దన్రెడ్డి, అనిల్కుమార్ 2023 ఆగస్టులో మాట్లాడుకున్నాం. (వైసీపీ) ప్రభుత్వం మనదే కాబట్టి లైసెన్స్ లేకుండా మైనింగ్ చేస్తే ఇబ్బందులు ఉండవనుకున్నాం. తాటిపర్తి దగ్గర్లో ఉన్న రుస్తుం మైన్స్ లీజు అయిపోయిందని తెలుసుకున్నాం. 2023 అక్టోబరు, నవంబరు నెలల్లో రుస్తుం మైన్స్లో తవ్వకాలు జరిపి క్వార్ట్జ్ను బయటకు తీయమని పొదలకూరుకు చెందిన వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డిలను కాకాణి పురమాయించారు. తవ్వి తీసిన క్వార్ట్జ్ను గ్రేడింగ్ చేసి కొందరు వ్యక్తుల సహకారంతో చెన్నై పోర్టు ద్వారా చైనాకు ఎక్స్పోర్ట్ చేశాం. రుస్తుం మైన్లో బ్లాస్టింగ్ చేయడానికి మార్టూరు ప్రాంతం నుంచి పేలుడు పదార్థాలు తెప్పించాం.
ఈ వ్యవహారాలు చూసుకున్నందుకు నాకు టన్నుకు రూ.వెయ్యి ఇచ్చేవారు. అంతకుముందే 2022 నుంచి నేను, అనిల్కుమార్ కలిసి గూడూరు, వెంకటగిరి, చిల్లకూరు, సైదాపురం మండలాల్లో ఇసుక, క్వార్ట్జ్ మైనింగ్ చేయిస్తూ, క్వార్ట్జ్ను ఎక్స్పోర్ట్ చేయించేవాళ్లం. ఒక్కో టన్నుకు రూ.7 వేల నుంచి రూ. 10 వేల వరకూ మామూళ్లు తీసుకున్నాం. ఇతర ఎక్స్పోర్టర్స్ ఎవరైనా చెల్లించకపోతే వారికి ఫోన్లు చేసి కేసులు పెట్టిస్తామని బెదిరిస్తూ వసూళ్లు చేశాం. 2024 మార్చి వరకూ వచ్చిన ఈ మామూళ్ల డబ్బుతో నేను, అనిల్కుమార్ గూడూరు వద్ద 100 ఎకరాల భూమి కొనుగోలు చేసి గ్రీన్మిడోస్ పేరుతో, నాయుడుపేట వద్ద 50 ఎకరాలు కొని స్వర్ణముఖి స్మార్ట్సిటీ పేరుతో వెంచర్లు వేశాం. హైదరాబాద్లో మణికొండ వద్ద హెవెన్లీ హోమ్స్ పేరుతో, తర్కేంజల్ వద్ద గ్రీన్ మిడోస్ పేరుతో హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ చేశాం. 2024లో ప్రభుత్వం మారాక క్వార్ట్జ్ తవ్వకాలపై కేసులు పెడతారన్న భయంతో నేను కుటుంబంతో హైదరాబాద్కు వెళ్లి అక్కడే ఉంటున్నాను’’ అని తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో కాకాణి 2 నెలలుగా రిమాండ్లో ఉన్నారు. త్వరలోనే అనిల్నూ అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు
వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు
For More AP News and Telugu News
Updated Date - Jul 23 , 2025 | 03:30 AM