ప్రధాని సభకు 1.20 లక్షల మంది!
ABN, Publish Date - Apr 25 , 2025 | 01:30 AM
రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి 1.20 లక్షల మంది రానున్నట్లు సమాచారం. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల నుంచి వీరు తరలివస్తున్నట్లు తెలిసింది.
- మే 2న రాజధాని అమరావతి పునర్నిర్మాణ సభ
- కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల నుంచి రాక
- ప్రధాని మోదీ రోడ్డు షోకు హాజరుకానున్న 30 వేల మంది
- సభ ప్రాంగణంలోని గ్యాలరీలకు తరలిరానున్న మరో 90 వేల మంది
- 2400 బస్సుల్లో ఏడు రూట్లలో సభ వద్దకు చేరనున్న ప్రజలు
విజయవాడ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి):
రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి 1.20 లక్షల మంది రానున్నట్లు సమాచారం. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల నుంచి వీరు తరలివస్తున్నట్లు తెలిసింది. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి 30 వేల మంది చొప్పున, కృష్ణా, బాపట్ల, ఏలూరు జిల్లాల నుంచి 10 వేల మంది చొప్పున వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాన సభా ప్రాంగణం 28 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ప్రధాన వేదికలు పోను గ్యాలరీలను 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. సభలో సీటింగ్ 50 వేల వరకు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే వారు, వెళ్లే వారు ఉంటారు కాబట్టి మొత్తంగా 1.20 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. వీరిలో 30 వేల మంది ప్రధాని రోడ్డు షోకు వెళ్తారని సమాచారం. మే 2వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
2,400 బస్సులు ఏర్పాటు
రాజధాని సభకు వచ్చే వారికి ప్రభుత్వం 2,400 బస్సులను ఏర్పాటు చేయనుంది. గుంటూరు నుంచి 600 బస్సులు, ఎన్టీఆర్ జిల్లా నుంచి 600 బస్సులు, పల్నాడు జిల్లా నుంచి 600 బస్సులు, కృష్ణాజిల్లా నుంచి 200 బస్సులు, బాపట్ల జిల్లా నుంచి 200 బస్సులు, ఏలూరు జిల్లా నుంచి 200 బస్సుల్లో ప్రజలు సభా ప్రాంగణానికి తరలిరానున్నారు.
ఆరు రూట్లలో సభ వద్దకు..
గుంటూరు జిల్లా నుంచి 30 వేల మంది రూట్ నెంబర్-4లో 200 బస్సుల ద్వారా మంగళగిరి, డాన్ బాస్కో, ఎర్రబాలెం, ఈ8, ఈ9 రోడ్ల మీదుగా పార్కింగ్-1 ప్లేస్కు చేరుకుంటారు. రూట్ నెంబర్-5లో 200 బస్సుల ద్వారా ఎన్హెచ్-16, పశ్చిమ బైపాస్, నిడమర్రు, కురగల్లు, ఎన్-9 రోడ్డు మీదుగా పార్కింగ్-1 ప్లేస్కు తరలివస్తారు. రూట్ నెంబర్-6లో మరో 200 బస్సులలో తాడికొండ, పెదపరిమి, తుళ్లూరు, ఈ 6 రోడ్డు మీదుగా పార్కింగ్-1 ప్లేస్కు వస్తారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి 30 వే ల మంది రూట్ నెంబర్ - 1 ద్వారా 600 బస్సులలో గొల్లపూడి, వెస్ట్ బైపాస్, వెంకటపాలెం సర్వీసు రోడ్డు, మందడం, ఎన్ 7 రోడ్డు, ఈ 8 జంక్షన్, ఈ 8, ఎన్ 8 రోడ్ల మీదుగా పార్కింగ్-6 ప్లేస్కు తరలివస్తారు. పల్నాడు జిల్లా నుంచి 30 వేల మంది రూట్ నెంబర్-6 ద్వారా 400 బస్సులలో తాడికొండ, పెదపరిమి, తుళ్లూరు, ఈ 6 రోడ్డు మీదుగా పార్కింగ్-1 ప్లేస్కు వస్తారు. మరో 200 బస్సులలో రూట్ నెంబర్-7 ద్వారా అమరావతి, బోరుపాలెం, రాయపూడి, హైకోర్టు రోడ్డు మీదుగా ఈ 6, ఎన్ - 10 రోడ్డు మీదుగా పార్కింగ్ - 1 ప్లేస్కు తరలివస్తారు. కృష్ణాజిల్లా నుంచి వచ్చే 10 వేల మంది రూట్ నెంబర్-3, 4 ద్వారా 200 బస్సులలో కనకదుర్గా వారధి, ఓటీజీ, స్ర్కూ బ్రిడ్జి, నులకపేట, డాన్ బాస్కో, యర్రబాలెం, ఈ 8, ఎన్ 9 జంక్షన్ల మీదుగా పార్కింగ్ - 7 ప్లేస్కు వెళతారు. బాపట్ల జిల్లా నుంచి వచ్చే 10 వేల మంది రూట్ నెంబర్ - 5 ద్వారా ఎన్హెచ్ - 16, వె స్ట్ బైపాస్, నిడమర్రు, కురగల్లు, ఎన్-9 రోడ్డు జంక్షన్ మీదుగా పార్కింగ్ - 1 ప్లేస్కు వస్తారు. ఏలూరు జిల్లా నుంచి వచ్చే 10 వేల మంది రూట్ నెంబర్ - 1 ద్వారా 200 బస్సులలో గొల్లపూడి, వెస్ట్ బైపాస్, వెంకటపాలెం, సర్వీసు రోడ్డు, మందడం, ఎన్-7 రోడ్డు, ఈ - 8 రోడ్డు మీదుగా పార్కింగ్ - 6 ప్లేస్కు వెళతారు.
గ్యాలరీలకు జనం ఇలా..
ఆరు రూట్లలో పార్కింగ్ ప్లేసులకు చేరుకున్న వారంతా కూడా తమకు నిర్దేశించిన విధంగా కొందరు రోడ్డు షోలో పాల్గొనటానికి, మరికొందరు గ్యాలరీలలో కూర్చోవటానికి వెళ్తారు. గుంటూరు జిల్లా నుంచి వచ్చే 30 వేల మంది పూర్తిగా గ్యాలరీలలోనే కూర్చుంటారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చే 30 వేల మందిలో 5 వేల మంది రోడ్డుషో, 25 వేల మంది గ్యాలరీలకు వెళ్తారు. పల్నాడు జిల్లా నుంచి వచ్చే 30 వేల మంది కూడా గ్యాలరీలలోనే కూర్చుంటారు. కృష్ణా, బాపట్ల జిల్లాల నుంచి వచ్చే 20 వేల మంది కేవలం రోడ్డు షోకు మాత్రమే వెళతారు. ఏలూరు జిల్లా నుంచి వచ్చే 10 వేల మందిలో 5 వేల మంది రోడ్డు షోకు, మరో ఐదు వేల మంది గ్యాలరీలలోకి వెళ్తారని సమాచారం.
పీఎం రోడ్డు షోకు..
ప్రధాని నరేంద్ర మోదీ దిగే హెలీప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు 15 నిమిషాల పాటు జరిగే రోడ్డు షోకు మొత్తం 30 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి 5 వేలు, కృష్ణాజిల్లా నుంచి 10 వేలు, బాపట్ల జిల్లా నుంచి 10 వేలు, ఏలూరు జిల్లా నుంచి 5 వేల మంది తరలివస్తారని ఆయా జిల్లా యంత్రాంగాలు అంచనా వేస్తున్నాయి.
ప్రకాశం బ్యారేజీ మీదుగా వీఐపీ రూట్
సభా ప్రాంగణానికి వెళ్లేందుకు వీఐపీ రూట్ను ఏర్పాటు చేశారు. ఈ వీఐపీ రూట్ విజయవాడలో ప్రకాశం బ్యారేజీ, కరకట్ట, వెంకటపాలెం, సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ఈ - 3, ఎన్ 9 జంక్షన్ నుంచి ఎడమవైపుగా ఈ-6, ఎన్ 9 జంక్షన్ను టచ్ చేస్తూ సచివాలయం పక్క నుంచి నేరుగా పీ-9 పార్కింగ్ ప్లేస్కు వాహనాలు వెళతాయి. ఒకవేళ అవాంతరాలు ఏమైనా ఏర్పడితే వీఐపీ ఆల్టర్నేటివ్ రూట్ను కూడా నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి జంక్షన్, ఉండవల్లి రోడ్డు మీదుగా వెంకటపాలెం వెళ్లేలా ప్లాన్ చేశారు.
Updated Date - Apr 25 , 2025 | 01:30 AM