అనంతపురం జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. జగనాసుర వధకు గడువు 46 రోజులేనని.. ప్రజాగళం సభలకు వస్తున్న ప్రజా ఉధృతే ఈ విషయం చెబుతోందని చెప్పారు. మే 13న ఓట్ల సునామీ రాబోతోందని.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్యపై సీఎం జగన్రెడ్డి నంగనాచి కబుర్లు చెబుతుండడం చూస్తుంటే నవ్వొస్తోందని చంద్రబాబు అన్నారు. పులివెందులలో ఆయన మాట్లాడిన తీరు హాలీవుడ్.. బాలీవుడ్ స్థాయి నటనను మించిపోయిందని ఎద్దేవాచేశారు. మనం ‘మహాశక్తి’తో ఆడబిడ్డలను గౌరవిస్తుంటే.. జగన్ సొంత చెల్లెళ్ల పుట్టుకనే ప్రశ్నిస్తున్నారని విమర్శించారు.