Minister Payyavula Keshav : ప్రతి శుక్రవారం బ్యాంకుల నుంచి ఫోన్లు
ABN, Publish Date - Dec 30 , 2024 | 04:02 AM
గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు.
వైసీపీ చేసిన అప్పులపై వడ్డీలకు ఒత్తిళ్లు
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆవేదన
కర్నూలు (రాజ్విహార్ సర్కిల్), డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాష్ట్రంపై ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల అప్పులు మోపారని, వాటికి వడ్డీలు కట్టాలంటూ ప్రతి శుక్రవారం తనకు ఏదో ఒక బ్యాంకు నుంచి ఫోన్ వస్తోందని చెప్పారు. వైసీపీ చేసిన విధ్వంసంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని జాగ్రత్తగా పాలన సాగించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కొంచెం సమయం తీసుకున్నా చిన్న కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వారి బకాయిలను మార్చిలోపు ఎంతో కొంత చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్నూలు నగరంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో స్టేట్ ఆఫ్ ఏపీ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) 2025-డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల మాట్లాడుతూ.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం జీతాలకు, పెన్షన్లకే సరిపోతోందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని, దీనివల్ల ఆదాయం పెరుగుతుందని, దీంతో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడంతో పాటు కొత్త పథకాలకు రూపకల్పన చేయవచ్చని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. జగన్ హయాంలో తనకు రావాల్సిన రూ.88 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టారని తెలిపారు. వాటిని చెల్లించమని పలుమార్లు విన్నవించగా.. పార్టీ మారితే బిల్లులు చెల్లిస్తామని ఒత్తిడి చేసినట్లు చెప్పారు. 250 మంది కాంట్రాక్టర్లు బిల్లుల కోసం విశాఖలో పార్టీ మారినా కూడా వారి బిల్లులు చెల్లించలేదన్నారు.
Updated Date - Dec 30 , 2024 | 04:02 AM