Bandi Sanjay: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీని సిట్కు అప్పగించడంపై బండి ఫైర్
ABN, First Publish Date - 2023-03-15T11:58:25+05:30
టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం (BJYM) కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ (BJP Leader Bandi Sanjay Kumar) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం ఉదయం బండి సంజయ్ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వాళ్లను వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. అరెస్టులు, జైళ్లు బీజేపీ కార్యకర్తలకు కొత్తకాదని స్పష్టం చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల పక్షాన ఎంతకైనా పోరాడతామని ఉద్ఘాటించారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని, అందుకు కారకులైన వారిని వదిలేసి పోరాడుతున్న వారిపై కేసులు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. తక్షణమే అరెస్ట్ చేసిన బీజేవైఎం బేషరతుగా కార్యకర్తలందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బీజేపీ నేత హెచ్చరించారు.
ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై రాష్ర ప్రభుత్వం సిట్ (SIT)ను ఏర్పాటు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. సిట్కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నయీం కేసు, డ్రగ్స్ కేసు, డేటా చోరీ సహా సిట్కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును కూడా రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చేందుకు యత్నిస్తోందని, అందులో భాగంగానే సిట్కు అప్పగించారని ధ్వజమెత్తారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బండి సంజయ్ పేర్కొన్నారు.
Updated Date - 2023-03-15T11:58:25+05:30 IST