Uttam: లెండి ప్రాజెక్టు పూర్తికి సహకారం అందించాలి
ABN, Publish Date - Jan 24 , 2025 | 03:06 AM
మహారాష్ట్ర-తెలంగాణ అంతరాష్ట్ర ప్రాజెక్టు లెండి నిర్మాణం పూర్తి చేయడానికి తగు సహకారం అందించాలని మహారాష్ట్ర ప్రజాప్రతినిధులను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు.
మహారాష్ట్ర ప్రజాప్రతినిధులను కోరిన మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర-తెలంగాణ అంతరాష్ట్ర ప్రాజెక్టు లెండి నిర్మాణం పూర్తి చేయడానికి తగు సహకారం అందించాలని మహారాష్ట్ర ప్రజాప్రతినిధులను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. గురువారం సచివాలయంలో మంత్రిని నాందేడ్ ఎంపీ రవీంద్ర చవాన్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు పాటిల్తోపాటు పలువురు ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా లెండి ప్రాజెక్టుపై వారితో మంత్రి ఉత్తమ్ చర్చించారు.
1984లో రూ.2,183.88 కోట్ల అంచనా వ్యయంతో మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ముద్ఖేడ్ తాలూకాలో లెండి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని, ఈ ప్రాజెక్టు పూర్తయితే మహారాష్ట్రలో 27,710 ఎకరాలు, తెలంగాణలో 38,573 ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. ఇప్పటిదాకా ఇరు రాష్ట్రాలు ఈ ప్రాజెక్టుపై రూ.1,040.87 కోట్లు వెచ్చించాయని, ఎర్త్డ్యామ్ పనులు 70శాతంవరకు, స్పిల్వే పనులు 80శాతం వరకు పూర్తయ్యాయని, కాలువల నిర్మాణం పురోగతిలో ఉందని గుర్తు చేశారు. 2011లో భూనిర్వాసితుల సమస్య కారణంగా పనులు ఆగిపోయాయని, ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Updated Date - Jan 24 , 2025 | 03:06 AM