GHMC: జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతో రెండు ప్రాణాలు బలి
ABN, Publish Date - Feb 27 , 2025 | 04:38 AM
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారుల నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. చెరువును శుభ్రం చేసేందుకు అందులోకి దిగిన తండ్రీ కొడుకులు నీట మునిగి చనిపోయారు.
చెరువును శుభ్రం చేస్తూ తండ్రీ కొడుకు మృత్యువాత
కార్వాన్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారుల నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. చెరువును శుభ్రం చేసేందుకు అందులోకి దిగిన తండ్రీ కొడుకులు నీట మునిగి చనిపోయారు. ఈ ఘటన బుధవారం హైదరాబాద్ లంగర్హౌజ్లోని హుడాపార్కు చెరువులో జరిగింది. హుడా పార్కు చెరువును శుభ్రం చేసేందుకు ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేసే మహ్మద్ ఖరీమ్ (38) అందులోకి దిగాడు. శివరాత్రి సందర్భంగా పాఠశాలకు సెలవు ఉండడంతో స్థానికంగా 9వ తరగతి చదువుతున్న ఖరీమ్ కొడుకు సోహెల్ (15) కూడా తండ్రికి సాయం చేసేందుకు చెరువులోకి దిగాడు.
వీరిద్దరూ చెరువులో గడ్డిని తొలగిస్తుండగా, లోతైన ప్రాంతానికి వెళ్లిన సోహెల్ అక్కడ బురదలో ఇరుక్కుపోయి నీట మునిగాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన తండ్రి ఖరీమ్ కూడా బురదలో చిక్కుకుపోయి నీట మునిగి ప్రాణాలు విడిచాడు. తోటి ఔట్సోర్సింగ్ సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. బీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని అరగంట వ్యవధిలో రెండు మృతదేహాలను వెలికి తీశారు. ఔట్సోర్సింగ్ సిబ్బందికి భద్రతా పరికరాలను సమకూర్చలేదని, కనీసం లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే కౌసర్ పేర్కొన్నారు.
Updated Date - Feb 27 , 2025 | 04:38 AM