ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల
ABN, Publish Date - Mar 10 , 2025 | 04:07 AM
రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీ ఎడ్సెట్-2025) షెడ్యూల్ విడుదలైంది.
ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ
జూన్ 1న పరీక్షల నిర్వహణ
కేయూ క్యాంపస్, హైదరాబాద్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీ ఎడ్సెట్-2025) షెడ్యూల్ విడుదలైంది. ఆదివారం వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో వర్సిటీ వైస్ చాన్స్లర్, ఎడ్సెట్-2025 చైర్మన్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతా్పరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం, ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బైరు వెంకట్రామిరెడ్డి దీనిని విడుదల చేశారు. ఈ నెల 12 నుంచి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులను స్వీకరిస్తామని కన్వీనర్ పేర్కొన్నారు. మే 13 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని, రూ.250 అపరాధ రుసుముతో మే 20 వరకు, రూ.500తో మే 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
జూన్ 1న రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జనరల్ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ కేటగిరీ అభ్యర్థులందరికీ రూ.550 ఫీజు ఉంటుందన్నారు. పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా జరుగుతాయని తెలిపారు. ఈసారి ఎడ్సెట్ను కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.
Updated Date - Mar 10 , 2025 | 04:07 AM