KIMS: కణితిలో జన్యువును గుర్తించి చికిత్స
ABN, Publish Date - Feb 16 , 2025 | 04:52 AM
‘కొలోరెక్టల్ క్యాన్సర్కు సరికొత్త శస్త్రచికిత్స, కీమోథెరపీలు అందుబాటులోకి వచ్చాయని, ఇంతకుముందు ఆ వ్యాధిగ్రస్తులు ఎవరికైనా ఒకే రకమైన చికిత్స చేసేవాళ్లం.
కొలోరెక్టల్ క్యాన్సర్కు చికిత్సలో కొత్త విధానాలు
ఆధునిక జీవనశైలితో పెరిగిన ఉదరకోశ వ్యాధులు
సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ సదస్సులో వైద్యులు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ‘కొలోరెక్టల్ క్యాన్సర్కు సరికొత్త శస్త్రచికిత్స, కీమోథెరపీలు అందుబాటులోకి వచ్చాయని, ఇంతకుముందు ఆ వ్యాధిగ్రస్తులు ఎవరికైనా ఒకే రకమైన చికిత్స చేసేవాళ్లం. ఇప్పుడు ఎవరికి వారికి తగిన చికిత్సా విధానాలు పాటిస్తున్నామ’ని వైద్యులు తెలిపారు. కిమ్స్, కిమ్స్-సన్షైన్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ వార్షిక సదస్సు నిర్వహించారు. కిమ్స్ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు సదస్సును ప్రారంభించారు. కిమ్స్ ఆస్పత్రి సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ గత దశాబ్దకాలంగా వ్యాధులు ఎక్కువ కావడంతో పాటు చికిత్సా పద్ధతులు కూడా గణనీయంగా మారిపోయాయని తెలిపారు.
కణితిలో ఏ జన్యువు ఉందో, దాన్ని ప్రభావితం చేసే మందులు ఏమిటన్నది గుర్తించి, వాటినే ఇస్తున్నామని వివరించారు. ఇన్ఫ్లమేటరీ బొవెల్ డిసీజ్ (ఐబీడీ), క్రాన్స్ వ్యాధి, ఇతర సమస్యలూ ఎక్కువవుతున్నాయన్నారు. ఐబీడీకి ఒకప్పుడు స్టెరాయిడ్లు ఇచ్చి, శస్త్రచికిత్సలు చేసేవాళ్లమని, కానీ ఇప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీ్సలాంటివి ఇచ్చి నయం చేస్తున్నామని చెప్పారు. ఆధునిక జీవన శైలి, కదలకుండా ఎక్కువసేపు ఒకేచోట కూర్చుండిపోవడం, పాశ్చాత్య తరహా ఆహారపు అలవాట్ల వల్ల మన దేశంలోనూ ఉదరకోశ వ్యాధులు చాలా ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన దశాబ్ద కాలంగా మన దేశంలో కొలోరెక్టల్ క్యాన్సర్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోయిందన్నారు. వైద్యులు విమలాకర్, ఆర్ఏ శాస్త్రి, జీవీ రావు, పీయూస్ సాహ్ని, సుజోయ్ పాల్తో పాటు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి 500 మందికి పైగా వైద్యులు హాజరయ్యారు.
Updated Date - Feb 16 , 2025 | 04:52 AM