ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఖాళీ చేయండి
ABN, Publish Date - Jan 05 , 2025 | 04:42 AM
ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ప్రజాప్రతినిధులు, మంత్రులకు తెలంగాణ అసెంబ్లీ అధికారులు శనివారం నోటీసులు ఇచ్చారు. వసతి సముదాయాన్ని ఖాళీ చేయాలని కోరారు.
ప్రజాప్రతినిధులకు సర్కారు నోటీసులు
హైదరాబాద్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ప్రజాప్రతినిధులు, మంత్రులకు తెలంగాణ అసెంబ్లీ అధికారులు శనివారం నోటీసులు ఇచ్చారు. వసతి సముదాయాన్ని ఖాళీ చేయాలని కోరారు. సిటింగ్ ఎమ్మెల్యేలకు హైదరగూడలోని నూతన వసతి సముదాయాన్ని కేటాయిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఆదర్శనగర్లో ఉన్న సముదాయ ఆవరణలో కాన్స్టిట్యూషనల్ క్లబ్ నిర్మించబోతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్బాబు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా అన్ని క్వార్టర్స్లో ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు సముదాయంలో ఉన్న దుకాణాలను కూడా ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీల కోసం ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ క్లబ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జనవరి 1న ‘ప్రజాప్రతినిధులకు కాన్స్టిట్యూషన్ క్లబ్’ శీర్షికతో పత్రికలో కథనం ప్రచురితమైంది. ఆదర్శనగర్లో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలో 4 ఎకరాల్లో ఈ క్లబ్ నిర్మించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మేథోపరమైన చర్చలు, సమావేశాలకు ఈ క్లబ్ వేదిక కానుందనేది అధికారుల సమాచారం.
Updated Date - Jan 05 , 2025 | 04:42 AM