Road Accidents: రోడ్డు పక్కన మృత్యు శకటాలు!
ABN, Publish Date - Mar 10 , 2025 | 04:22 AM
రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీల వల్ల ఆదివారం తెల్లవారుజామున రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఆగి ఉన్న వాహనాలను ఢీకొన్న కారు, ప్రైవేటు బస్సు
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
నార్కట్పల్లి, అల్వాల్, ఆదిలాబాద్ రూరల్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీల వల్ల ఆదివారం తెల్లవారుజామున రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని ఏపీలింగోటం వద్ద హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ఉన్న చిలసాగరం సందీ్పగౌడ్ (27), కుంచ సాయికుమార్గౌడ్ (35) అక్కడికక్కడే మరణించారు. ప్రవీణ్, మధుకర్, హరీశ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. హైదరాబాద్లోని అల్వాల్, యాప్రాల్ బొల్లారం కంటోన్మెంట్ ప్రాంతాలకు చెందిన వీరంతా స్నేహితులు.
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరారు. అయితే, ఓ లారీ డ్రైవర్ టీ తాగేందుకు లింగోటం శివారులోని ఓ హోటల్ వద్ద వాహనాన్ని రోడ్డుపైనే ఆపేశాడు. కారులో వస్తున్న వారు పొగ మంచు వల్ల లారీని గమనించిక దానిని ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు. ఇక, ఆదిలాబాద్ రూరల్ మం డలం జందాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు చనిపోయారు. ఆదివారం తెల్లవారు జామున ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళుతున్న వ్యాను టైరు పేలి డివైడర్ను ఢీకొట్టింది. దాంతో డ్రైవర్ వ్యాన్ను అలానే వదిలేశాడు. అయితే, 39 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్లోని బజల్పూర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ వ్యాన్ను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్లు లోచన్ సాహు (32), ప్రదీప్ సాహు (35) అక్కడికక్కడే చనిపోయారు. 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Updated Date - Mar 10 , 2025 | 04:22 AM