Landmine Blast: కట్టెల కోసం వెళితే కాలు పోయింది
ABN, Publish Date - Mar 09 , 2025 | 03:43 AM
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా రాంపురం అడవుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి 15 ఏళ్ల గిరిజన బాలిక తీవ్రంగా గాయపడింది.
ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలి గిరిజన బాలికకు గాయాలు
చర్ల/భద్రాచలం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా రాంపురం అడవుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి 15 ఏళ్ల గిరిజన బాలిక తీవ్రంగా గాయపడింది. గత మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీజాపూర్ జిల్లాలోని రాంపురం గ్రామానికి చెందిన కుంజా పాండె అనే బాలిక నాలుగు రోజుల క్రితం కట్టెల కోసం అడవిలోకి వెళ్లింది. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ బాంబ్పై కాలు వేయడంతో అది పేలి తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉంచి నాటు వైద్యం అందించారు.
బాలిక నరక యాతన అనుభవిస్తుండడంతో విషయం తెలుసుకున్న సీఆర్పీఎఫ్ పోలీసులు ఆమెను శనివారం సరిహద్దున ఉన్న తెలంగాణలోని చర్ల మండలానికి చేర్చారు. దీంతో చర్ల సీఐ రాజువర్మ, ఎస్ఐ నర్సిరెడ్డి బాలికను 108లో భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక కుడికాలుకు తీవ్ర గాయాలు కావడంతో ఆ కాలును తొలగించారు.
Updated Date - Mar 09 , 2025 | 03:43 AM