ఆఫీసులో అడుగడుగునా ఆక్సిజన్ మొక్కలే...
ABN, Publish Date - Feb 09 , 2025 | 10:01 AM
ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఇది ఆఫీసా? నర్సరీనా? అనే అనుమానం వస్తుంది. ఒకటి కాదు... రెండు కాదు... సుమారు 20 వేలకు పైగా మొక్కలు. పైగా అవన్నీ కూడా ‘నాసా’ సిఫారసు చేసిన ఆక్సిజన్ మొక్కలే కావడం విశేషం. ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించేందుకు చేసిన ఈ ప్రయత్నం అందరి ప్రశంసలందుకుంటోంది.
ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఇది ఆఫీసా? నర్సరీనా? అనే అనుమానం వస్తుంది. ఒకటి కాదు... రెండు కాదు... సుమారు 20 వేలకు పైగా మొక్కలు. పైగా అవన్నీ కూడా ‘నాసా’ సిఫారసు చేసిన ఆక్సిజన్ మొక్కలే కావడం విశేషం. ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించేందుకు చేసిన ఈ ప్రయత్నం అందరి ప్రశంసలందుకుంటోంది.
విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్స్ అనగానే ఐకానిక్ భవనాలైన మిలీనియం టవర్స్, స్టార్టప్ విలేజ్ మదిలో మెదులుతాయి. నాలుగు కొండలపైనా సుమారు యాభైకి పైగా భవనాలు ఉండగా వాటిలో ‘సింబయాసిస్ టెక్నాలజీస్’ మాత్రం ప్రత్యేకం. అది ఐటీ ఆఫీసా...?, గ్రీన్ బిల్డింగా?... అనే అనుమానం కలుగుతుంది. ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ప్రధాన ప్రవేశ ద్వారం నుంచి సీఈఓ రూమ్ దాకా అంతా పచ్చదనమే పరుచుకుని ఉంటుంది.
అడుగడుగునా మొక్కలే. వేలాది మొక్కలతో అదొక నందనవనంలా కనిపిస్తుంది.
హిల్ నంబరు 2లో ఎడమవైపున చివరగా ఉండే ఈ ఐటీ కార్యాలయానికి వెళితే...
మొక్కలతో తీర్చిదిద్దిన ‘వెల్కమ్’ స్వాగతం పలుకుతుంది. పూల మొక్కలతో తీర్చిదిద్దిన గార్డెన్ మధ్యలో తుంబురనాధుడు, ఎగిరే రెక్కల గుర్రం చాలా భిన్నంగా కనిపిస్తాయి. సెల్లార్ నుంచి టెర్రస్ వరకు ప్రతి అంతస్థులో ఎటు చూసినా మొక్కలే కనువిందు చేస్తాయి. ఆహ్లాదం కలిగిస్తాయి. భవనం చుట్టూ, బయటే కాకుండా వరండాల్లోను ఉద్యోగులు పనిచేసే ప్రాంతంలో కూడా మొక్కలు ఉండడం విశేషం.
ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించడానికి...
ఇక్కడ ఉద్యోగులు పనిచేసే ప్రాంతంలో ఆక్సిజన్ అందించే మొక్కలనే (నాసా సిఫారసు చేసినవి)నే అధికంగా పెంచుతున్నారు. అవి నిరంతరం గాలిని ప్యూరిఫై చేసి మంచి ఆక్సిజన్ను అందిస్తుంటాయి. అరెకా పామ్, పీస్ లిల్లీ, స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, ఫిలోడెండ్రాన్ బిర్కిన్, క్లోరోపైటమ్, అలోవిరా, ఎగ్జాటిక్ అగ్లానెమా, జామియా వంటి మొక్కల్లో వివిధ రకాలు ఇక్కడ కనిపిస్తాయి. సుమారు ఇరవై వేలకు పైగా మొక్కలు ఈ ఆవరణలో చూడొచ్చు. సాధారణంగా ఐటీ ఉద్యోగులకు పని ఒత్తిడి అధికం. స్ర్టెస్ ఫీలవుతారు. అలాంటి సమయంలో వారు బయటకు వచ్చి ఆఫీసు ఆవరణలో కాసేపు అలా తిరిగితే మైండ్ ఫ్రెష్గా మారి ఒత్తిడి మొత్తం ఎగిరిపోతుంది. ఉద్యోగులూ అదే విషయాన్ని చిరునవ్వుతో చెబుతున్నారు.
వాతావరణం... ఆహ్లాదభరితం...
ఓ ఐఐటీ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో... ఆక్సిజన్ ప్లాంట్లు ఫొటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ను తీసుకొని, గాలిని ప్యూరిఫై చేసి మంచి ఆక్సిజన్ను విడుదల చేస్తాయని తేలింది. ఆ గాలిని పీల్చడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. రెస్పిరేటరీ సిస్టమ్ కూడా బాగుంటుంది. ‘వీటన్నింటి వల్ల ఉద్యోగుల నుంచి ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. ఆఫీసు నిర్వహణలో విద్యుత్ వ్యయం కూడా 10 నుంచి 15 శాతం తగ్గుతోంది. అందుకే ఆక్సిజన్ మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.
సీజన్ల వారీగా ఆయా కాలాల్లో పెరిగే పూలమొక్కలను కూడా కడియం నుంచి తెప్పించి పెంచుతున్నాం. ఇక్కడి వాతావరణం ఆహ్లాదంగా ఉండటంతో సినిమా షూటింగ్లు కూడా చేస్తున్నారు’ అని సంస్థ సీఈఓ ఓరుగంటి నరేశ్కుమార్ అన్నారు. సందర్శకులు కూడా ఉల్లాసభరితంగా ఉన్న ఆఫీసు వాతావరణం చూసి ఆశ్చర్య పోతున్నారు. అన్ని ఆఫీసులు ఇలా నందన వనంలా ఉంటే... ఉద్యోగులకు ఆరోగ్యంతో పాటు... వారి పనితీరు మెరుగై మంచి ఫలితాలుంటాయనడంలో సందేహం లేదు.
- యర్రా శ్రీనివాసరావు, విశాఖపట్నం
ఫొటోలు: వై.రామకృష్ణ
Updated Date - Feb 09 , 2025 | 10:01 AM