మందుల మంచీ చెడూ
ABN, Publish Date - Mar 04 , 2025 | 06:53 AM
మనం రకరకాల మందులు వాడుకుంటూ ఉంటాం. వాటిలో పరగడుపున తీసుకోవాల్సిన మందులుంటాయి. తినే ముందూ, తిన్న తర్వాత వసుకోవలసినవీ ఉంటాయి....
ఔషధ వినియోగం
మందుల మంచీ చెడూ
మనం రకరకాల మందులు వాడుకుంటూ ఉంటాం. వాటిలో పరగడుపున తీసుకోవాల్సిన మందులుంటాయి. తినే ముందూ, తిన్న తర్వాత వసుకోవలసినవీ ఉంటాయి. మందులు సమర్థంగా పనిచేయాలంటే, వాటిని ఎలా వాడుకోవాలో, వాటి వాడకంలో ఎలాంటి నియమాలు పాటించాలో వైద్యులు ఇలా వివరిస్తున్నారు.
పోపుల డబ్బా లేకపోతే వంటింట్లో వంట పూర్తి కానట్టే, మందుల డబ్బా లేకపోతే ఆరోగ్యం అటకెక్కే పరిస్థితి చాలా ఇళ్లలో ఉంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్, రక్తం పలుచన చేసే మందులు... ఇలా మన మందుల డబ్బాలో రకరకాల మందులు ఉంటూ ఉంటాయి. ఏ మాత్రను ఎప్పుడు మింగాలో వైద్యుల ప్రిస్ర్కిప్షన్లో స్పష్టంగా పేర్కొని ఉంటుంది. అయినా ఆ నియమాలను తూచతప్పకుండా పాటించేవాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఉదయం మింగవలసిన మాత్ర మర్చిపోయి, మధ్యాహ్నం వేసుకునేవాళ్లుంటారు. పరగడుపున తీసుకోవలసిన మందును తిన్న తర్వాత వేసుకునేవాళ్లుంటారు. వేసుకోవలసిన మాత్రలన్నిటినీ ఒకేసారి కలిపి మింగేసేవాళ్లూ ఉంటారు. కానీ తీసుకునే మందుల సామర్థ్యం పూర్థి స్థాయిలో దక్కాలన్నా, శరీరం మందును సంపూర్తిగా శోషించుకోవాలన్నా వైద్యులు సూచించిన నియమాలను తప్పనిసరిగా అనుసరించాలి.
ఖాళీ కడుపుతో...
కొన్ని మందులను శరీరం సమర్థంగా శోషించుకోవాలంటే వాటిని ఖాళీ కడుపుతోనే తీసుకోవాలి. థైరాయిడ్ మాత్ర అలాంటిదే! థైరాయిడ్ హార్మోన్ ఉధృతి ఉదయం వేళ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మాత్రను తప్పనిసరిగా పరగడుపునే తీసుకోవాలి. సెమాగ్లూటైడ్ అనే మధుమేహం మందు, ఉదయం అల్పాహారానికి గంట ముందు తీసుకోవాల్సి ఉంటుంది. సల్ఫనైలూరియాస్ అనే మధుమేహ మందును ఆహారానికి అరగంట ముందు వేసుకోవాలి. మెట్ఫార్మిన్ అనే ఇంకొక రకం మందు ఆహారం తర్వాత తీసుకోవచ్చు. ఇంకొన్ని రకాల మధుమేహం మందులు తిన్న తర్వాతే తీసుకోవలసి ఉంటుంది. ఎప్పుడు తీసుకోవడం మేలన్నది చక్కెర మందు రకం మీద ఆధారపడి ఉంటుంది. అధిక రక్తపోటుకు వాడుకునే కొన్ని మందులతో పొట్టలో సమస్యలు వేధిస్తాయి కాబట్టి వీటిని ఆహారం తిన్న తర్వాత తీసుకోవాలి.
కొన్ని ఆహారం తర్వాతే...
ఒకే పూట ఒకటి కంటే ఎక్కువ మందులు వాడుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు వాటిని కలిపి వేసుకున్నా సమస్య ఉండదు. అయితే ఖాళీ కడుపుతో వేసుకోవలసిన మాత్ర పరగడుపునే ఆ ఒక్క మాత్రకే పరిమితం కావడం ఉత్తమం. నొప్పి నివారణ మందులతో గ్యాస్ట్రైటిస్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మందులను ఆహారం తిన్న తర్వాతే తీసుకోవాలి. అలాగే మందుల ప్రభావం ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. పాంటాప్రొజోల్ లాంటి అసిడిటీ మందులు ఆహారం తినడానికి అర గంట ముందే వేసుకోవాలి. కొన్ని క్యాల్షియం మందులను ఖాళీ కడుపుతో వేసుకుంటే గ్యాస్ట్రైటిస్ సమస్య వేధిస్తుంది. కాబట్టి వీటిని కూడా తిన్న తర్వాత తీసుకోవాలి. అలాగే ఐరన్ మందులతో కొందరికి మలబద్ధకం, మరికొందరికి డయేరియా రావచ్చు. కాబట్టి వాటిని కూడా ఆహారం తిన్న తర్వాత తీసుకోవాలి.
మందులు వికటిస్తే?
మోతాదు పెరగడం వల్ల, ఊహించని పరిణామాల వల్ల మందులు వికటించే అవకాశాలుంటాయి. ఒకసారి సమర్థంగా పనిచేసిన మాత్ర, కొన్ని రోజుల తర్వాత రెండోసారి తీసుకున్నప్పుడు డ్రగ్ రియాక్షన్కు దారి తీయవచ్చు. ఆ నిర్దిష్ట సమయంలో, ఆ నిర్దిష్ట మందుకు, మన శరీరం అవసరానికి మించి స్పందించడమే ఈ పరిస్థితికి కారణం. కొన్ని సందర్భాల్లో మందు మోతాదు పెరగడం వల్ల కూడా డ్రగ్ రియాక్షన్ సంభవించవచ్చు. ఇలా మందులు వికటించినప్పుడు ప్రధానంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే...
చర్మం మీద దద్దుర్లు, దురదలు
వాంతులు
కడుపులో నొప్పి
కళ్లు తిరగడం
తీవ్రమైన డ్రగ్ రియాక్షన్లో...
సాధారణంగా సిప్రోఫ్లాక్సిన్, నార్ఫ్లాక్సిన్ లాంటి ఫ్వోరోక్లినోలోన్స్ తాలూకు మందులతో, ఎప్టాయిన్, కార్బామజెపీన్, వ్యాల్ప్రొవేట్ లాంటి కొన్ని మూర్ఛ మందులతో, కొన్ని నొప్పి నివారణ మందులతో, కొన్ని యాంటీబయాటిక్స్తో కొందర్లో తీవ్ర డ్రగ్ రియాక్షన్ తలెత్తే అవకాశాలుంటాయి. ఎంతో అరుదుగా కొన్ని కీమోథెరపీ మందులు కూడా వికటిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
రక్తపోటు పూర్తిగా పడిపోతుండి
అంతర్గత వాపులు ఏర్పడతాయి
శ్వాస నాళికలో వాపు వల్ల శ్వాస అందని ప్రమాదకర పరిస్థితి తలెత్తవచ్చు
కాబట్టి తేలికపాటి లక్షణాలైనా, తీవ్రమైనా లక్షణాలైనా వాటిని వైద్యుల దృష్టికి తీసుకువెళ్లడం అత్యవసరం. అలాగే వికటించిన మందులను గుర్తు పెట్టుకుని, వైద్యులను కలిసి, చికిత్స తీసుకునే ప్రతి సందర్భంలో వాటి గురించి వైద్యులకు తెలియపరచాలి.
మందుల నిల్వ ఇలా...
ప్రొబయాటిక్ మందులను ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవాలి
ఇన్సులిన్ మందులను ఫ్రీజర్లో నిల్వ చేసుకోవాలి
కీమోథెరపీ మందులు, వ్యాక్సిన్లు ఫ్రీజ్ చేసుకోవాలి
మధుమేహం, అధిక రక్తపోటు, ఇతరత్రా సాధారణ మందులన్నీ సూర్యరశ్మి సోకుకండా, నీడలో, గది ఉష్ణోగ్రతలో నిల్వ చేసుకోవాలి.
మద్యంతో మందులు?
మద్యం ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. మద్యంతో కలిపి తీసుకోవడం వల్ల, కొలెస్ట్రాల్ మందులు, రక్తం పలుచబడే మందుల ప్రభావం కూడా సన్నగిల్లుతుంది. అయితే మద్యం వల్ల రియాక్షన్ వచ్చే మందులు కూడా కొన్ని ఉన్నాయి. మద్యం మానేయడానికి తోడ్పడే డైసల్ఫిరామ్, నీళ్ల విరోచనాల కోసం తీసుకునే మెట్రోజిల్ గ్రూపు సంబంధిత మందులను మద్యంతో కలిపి తీసుకున్నప్పుడు రియాక్షన్ రావచ్చు. వాంతులు, చర్మం వాపులు, కడుపులో నొప్పి, శ్వాస సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి ఈ మందులను మద్యంతో కలిపి తీసుకోకూడదు.
సొంత వైద్యం ఎంత మేరకు?
సొంత వైద్యం అలవాటుగా మారకూడదు. మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వైద్యులు సూచించినంత కాలం, సూచించిన మోతాదుల్లో మాత్రమే వాడుకోవాలి. సూచించిన రోజుల కంటే తక్కువ రోజులకు పరిమితం కావడం, ఎక్కువ రోజులు వాడుకోవడం...
రెండూ శ్రేయస్కరం కాదు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ (మందులు పనిచేయని స్థితి) లేదా దుష్ప్రభావాలకు గురి కాకుండా ఉండాలంటే వైద్యులు సూచించకుండా వాటిని వాడుకోకూడదు.
కాలం చెల్లిన మందులతో...
కాలం చెల్లినంత మాత్రాన మందులు విషపూరితంగా మారిపోవు. ముందువరకూ సమర్థంగా పనిచేసిన మందులు, ఒక్క రోజు దాటిన వెంటనే విషంగా మారిపోయే పరిస్థితి ఉండదు. కానీ కాలం చెల్లిన తర్వాత మందులు వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. టెట్రాసైక్లిన్ గ్రూపుకు చెందినకాలం చెల్లిన మందులతో మాత్రం కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చు. కాబట్టి ఏ మందైనా దాని తయారీ, కాలం చెల్లే తేదీలను గమనించుకుని వాడుకోవాలి.
డాక్టర్ శశి కిరణ్
సీనియర్ జనరల్ ఫిజీషియన్,
యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: చిట్ఫండ్స్ బాధితులను ఆదుకొనే దిశగా చర్యలు
Also Read : ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
Also Read: సీఎం మార్పు తథ్యం.. ఎప్పటి లోగా అంటే..
Also Read: ఈ పని చేస్తే.. ప్రభుత్వ పథకాలు ఫట్
Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్
Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..
For AndhraPradesh News And Telugu News
Updated Date - Mar 04 , 2025 | 06:53 AM