Yemen Supreme Court : కేరళ నర్సుకు యెమెన్లో మరణశిక్ష
ABN, Publish Date - Jan 01 , 2025 | 04:47 AM
యెమెన్లో మరణశిక్ష పడిన భారతీయ నర్సు నిమిష ప్రియను ఆదుకొనేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది.
న్యూఢిల్లీ, డిసెంబరు 31: యెమెన్లో మరణశిక్ష పడిన భారతీయ నర్సు నిమిష ప్రియను ఆదుకొనేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. ఆ దేశ పౌరుడు తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కేసులో కేరళకు చెందిన ఆమెకు విధించిన మరణశిక్షను దేశాధ్యక్షుడు రషాద్ అల్-అలిమి తాజగా ఖరారు చేశారు. ఒక నెలలోపే ఆమెకు శిక్ష అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అంశంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ మంగళవారం స్పందించారు. ‘ప్రియను కాపాడుకొనేందుకు ఆమె కుటుంబం అన్ని అవకాశాలను అన్వేషించడాన్ని అర్థం చేసుకోగలం. ఈ విషయంలో ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుంది’ అని తెలిపారు. 2017 జూలైలో మెహదీని హత్య చేయడంతో పాటు అతడి మృతదేహాన్ని ముక్కలు చేసి పారేసిన కేసులో ప్రియకు ట్రయల్ కోర్టు 2020లో మరణశిక్ష విధించింది. 2022 మార్చిలో ఆమె అప్పీలును అప్పిలేట్ కోర్టు తిరస్కరించింది. 2023 నవంబరులో ఆ దేశ సుప్రీంకోర్టు ఈ తీర్పును సమర్థించింది.
Updated Date - Jan 01 , 2025 | 04:47 AM