Donald Trump: ఈయూపై 25% సుంకం విధిస్తాం
ABN, Publish Date - Feb 28 , 2025 | 04:34 AM
ప్రపంచ వాణిజ్యంపై అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికే యూరోపియన్ యూనియన్ కూటమి ఏర్పడిందంటూ మండిపడ్డారు. బుధవారం ఆయన తన మంత్రివర్గ సభ్యులతో తొలిసారి సమావేశమయ్యారు.
అమెరికాను దెబ్బ తీయడానికే కూటమి.. ఉక్రెయిన్ నాటో సభ్యత్వాన్ని మరచిపోవాలి
మూడేళ్ల యుద్ధానికి అసలు కారణం అదే
మంత్రివర్గ సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్, ఫిబ్రవరి 27: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి దిగుమతుల మీద 25 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు. ప్రపంచ వాణిజ్యంపై అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికే యూరోపియన్ యూనియన్ కూటమి ఏర్పడిందంటూ మండిపడ్డారు. బుధవారం ఆయన తన మంత్రివర్గ సభ్యులతో తొలిసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, కెనడా, మెక్సికోల మీద విధించిన 25 శాతం సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఈయూ దేశాలు అమెరికాను తేలిగ్గా తీసుకుంటున్నాయన్నారు. అవి అమెరికా వాహనాలను, వ్యవసాయ ఉత్పత్తులను ఏదో ఒక సాకుతో తీసుకోవడం లేదని చెప్పారు. అమెరికా మాత్రం ఎలాంటి షరతులు లేకుండా యూరప్ ఉత్పత్తులను స్వీకరిస్తోందని అన్నారు. అమెరికా మిత్రులు అనుసరిస్తున్న అన్యాయమైన వాణిజ్య విధానాల వల్ల అమెరికా భారీ వాణిజ్య లోటును ఎదుర్కొంటోందని చెప్పారు. యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి అమెరికాకు తయారీ రంగంలో 14 లక్షల కోట్ల రూపాయల లోటు ఉంటే సేవారంగంలో యూరోపియన్ యూనియన్ 9.5 లక్షల కోట్ల లోటును అమెరికా నుంచి ఎదుర్కొంటోంది. ఈయూ ప్రధానంగా రసాయనాలు, ఔషధాలను అమెరికాకు సరఫరా చేస్తుంటే, అమెరికా ప్రధానంగా సాఫ్ట్వేర్ను, ఇతర బిజినెస్ సొల్యూషన్లను యూరప్ దేశాలకు సరఫరా చేస్తోంది. ట్రంప్ ప్రకటనతో ఈయూ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ప్రధానంగా కార్ల షేర్లు పడిపోయాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ శుక్రవారం తనతో సమావేశం కానున్నట్లు ట్రంప్ ప్రకటించారు. నాటో సభ్యత్వం విషయంలో ఉక్రెయిన్ ఆశలు వదులుకోవాలని ట్రంప్ స్పష్టం చేశారు. అసలు ఉక్రెయిన్ నాటో సభ్యత్వం ఆకాంక్షల వల్లే సమస్య ఇక్కడిదాకా వచ్చిందని వ్యాఖ్యానించారు. త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా సమావేశం జరుగుతుందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే పరిష్కారాన్నిఆ సమావేశంలో కనుగొంటామన్నారు. చైనా బలప్రయోగంతో తైవాన్ను విలీనం చేసుకుంటే అమెరికా అనుమతిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ట్రంప్ నిరాకరించారు. చైనాతో సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు చెప్పారు.
గోల్డ్ కార్డుతో అమెరికా సంస్థల్లో భారతీయులకు ఉద్యోగాలు
అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీ పొందిన భారత్ సహా ఇతర విదేశీ విద్యార్థులకు యూఎ్సఏలోని కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా గోల్డ్కార్డు ఉపయోగపడుతుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. రూ.43.5 కోట్లు చెల్లించి గోల్డ్ కార్డు కొనుగోలు చేసిన వారికి అమెరికా శాశ్వత పౌరసత్వం ఇస్తామని ట్రంప్ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతమున్న ఈబీ-5 వీసా స్థానంలో గోల్డ్కార్డును తీసుకొస్తామని తెలిపారు. అయితే, ఈబీ-5లో ఉన్న ఉద్యోగాల కల్పన అవకాశాలు గోల్డ్కార్డులో ఎలా ఉంటాయనే దానిని వివరించలేదు. ఈ అంశంపై గురువారం ఆయన స్పష్టత ఇచ్చారు. ‘‘భారత్, జపాన్, చైనా తదితర దేశాలకు చెందిన వారు హార్వర్డ్, వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి ప్రముఖ సంస్థల నుంచి డిగ్రీలు తీసుకుంటున్నారు. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందుతున్నారు. కానీ, ప్రస్తుతమున్న నిబంధనల వల్ల వారు అమెరికాలో ఎంతకాలం ఉంటారనే విషయంలో అనిశ్చితి నెలకొని అవకాశాలు కోల్పోయి స్వదేశాలకు వెళ్లిపోతున్నారు. ఎంతో మేధస్సు కలిగిన వారంతా తమ దేశాల్లో వ్యాపారాలు ప్రారంభించి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అయితే, అలాంటి విద్యార్థులు తమ వద్ద పని చేయాలని అనుకునే కంపెనీలు గోల్డ్ కార్డు కొనుగోలు చేసి వారికి ఉద్యోగాలు ఇవ్వవచ్చు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. రెండు వారాల్లో గోల్డ్ కార్డు విక్రయాలను ప్రారంభిస్తామని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు.
మరిన్ని తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ
Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్
For National News And Telugu News
Updated Date - Feb 28 , 2025 | 04:34 AM