Thandel : సిక్కోలు వ్యథే.. ‘తండేల్’ కథ!
ABN, Publish Date - Feb 08 , 2025 | 03:12 AM
13 నెలలపాటు జైళ్ల లో మగ్గారు! ఈ యథార్థ వ్యథ... ‘తండేల్’గా వెండితెరపైకి ఎక్కింది!
జిల్లాలో 104 మత్స్యకార గ్రామాలు.. స్థానికంగా ఉపాధి లేక తంటాలు
ఏటా దూరప్రాంతాలకు వలస
పొరపాటున గీత దాటినా పొరుగు దేశాల జైలులో మగ్గాల్సిందే!
2018లో పాకిస్థాన్ బందీలుగా పలువురు జాలర్లు
13 నెలల పాటు జైల్లో నరకయాతన
అదే ఇతివృత్తంగా సినిమా నిర్మాణం
(రణస్థలం - ఆంధ్రజ్యోతి)
కనుచూపు మేర సముద్రం! సరిహద్దు గీతలు కనిపించని జలాలు! ఆ ‘కనిపించని గీత’ను వాళ్లు దాటా రు! పాకిస్థాన్ చెరలో చిక్కారు! 13 నెలలపాటు జైళ్ల లో మగ్గారు! ఈ యథార్థ వ్యథ... ‘తండేల్’గా వెండితెరపైకి ఎక్కింది! ఇది.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అనేకమంది మత్స్యకారుల దయనీయ పరిస్థితికి అద్దంపట్టే కథ! స్థానిక మత్స్యకారులు ఇక్కడ చేపల వేట గిట్టుబాటుకాక.. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో గుజరాత్లోని వీరావల్ ప్రాంతానికి వలస వెళతారు. ఫిబ్రవరి, మార్చిలో స్వస్థలాలకు చేరుతారు.
సముద్రమున్నా... ఉపాధి లేదు!
శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకూ 104 మత్స్యకార గ్రామాలున్నాయి. జిల్లాలో ఫిషింగ్ హార్బర్లు కానీ, జెట్టీలు కానీ అందుబాటులో లేకపోవడంతో మత్స్యకారులు సంప్రదాయ వేటకే పరిమితమయ్యారు. ఇప్పటికీ నాటు పడవలపై ప్రమాదక ర స్థితిలో వేట సాగిస్తున్నారు. స్థానికంగా వేట గిట్టుబాటుగాక జిల్లా నుంచి వేలాది మంది మత్స్యకారులు చెన్నై, ముంబై, కోల్కతా, పారాదీప్, వీరావల్(గుజరాత్) వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. బృందాలుగా వెళ్లి.. అక్కడున్న వ్యాపారు ల వద్ద పనికి కుదురుతారు. అక్కడ ఉన్నన్ని రోజులు దాదాపుగా సముద్రానికే అంకితమవుతారు. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదే. వీరి సమస్యను పరిష్కరించి... స్థానికంగా ఉపాధి కల్పించేలా గతం లో టీడీపీ హయాంలో భావనపాడు హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయింది. ఇంతలో వైసీపీ అధికారంలోకి రావడం తో హార్బర్ నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి. తర్వాత మంచినీళ్లపేటలో జెట్టీ, బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి వైసీపీ నేతలు శంకుస్థాపన చేశారు. కానీ పనులు ప్రారంభించలేదు.
ఇదీ అసలు కథ..
2018లో కె.మత్స్యలేశం గ్రామం నుంచి మత్స్యకారులు గుజరాత్లోని వీరావల్కు వలస వెళ్లారు. ఆ ఏడాది నవంబరు 30న పొరబాటున పాకిస్థాన్ జ లాల్లోకి ప్రవేశించారు. వెంటనే ఆ దేశ భద్రతా దళా లు వారిని నిర్భందించాయి. పాక్ జైల్లో వారు 13 నెలలపాటు మగ్గిపోతూ అష్టకష్టాలు పడ్డారు. ఆ సమయంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయు డు అప్పటి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్కు ఈ విషయం చెప్పడంతో 2020 జనవరి 6న మత్స్యకారులు విడుదలయ్యారు. ఇదే తండేల్ సినిమా.
మా వెతలు తీరనివి...
శ్రీకాకుళం జిల్లాలోని 11 మండలాల్లో మత్స్యకార యువతకు సరై న ఉపాధి లేక సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. ప్రమాదాల్లో మరికొందరు చిక్కుకుంటున్నారు.
- సూరాడ చంద్రమోహన్,
మత్స్యకార ఐక్యవేదిక అధ్యక్షుడు, శ్రీకాకుళం
ప్రాణాలపై ఆశలు వదులుకున్నాం!
వీరావల్ ప్రాంతంలో జెట్టీ నుంచి చేపలవేటకు వెళ్లాం. దాదాపు వేట పూర్తయింది. మరో అరగంటలో బయలుదేరుతామనగా.. మాకు చెందిన మూడు బోట్లు పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి చేరాయి. దీంతో అక్కడి కోస్టుగార్డులు గాల్లో కాల్పులు జరిపారు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాం. ప్రాణాలపై ఆశలు వదులుకున్నాం. మమ్మల్ని జైల్లోకి తీసుకెళ్లేసరికి 300 మంది విదేశీ మత్స్యకారులు ఉన్నారు. జైల్లో నరకయాతన పడ్డాం.
- రామారావు, బోటు డ్రైవర్ (తండేల్), కె.మత్స్యలేశం.
13 నెలల నరకయాతన
నా భర్త రామారావు వీరావల్ ప్రాంతానికి ఉపాధి కోసం ప్రతి సంవత్సరం వెళ్లేవారు. బోటు డ్రైవర్గా పనిచేస్తుండేవారు. ఈ క్రమంలో పాకిస్థాన్ కోస్టుగార్డులకు నా భర్త చిక్కారు. అప్పుడు నేను నిండు గర్భిణిని. నా భర్తను తలచుకుని తల్లడిల్లిపోయేవాళ్లం. కు టుంబసభ్యులను ఓదార్చుతూ.. నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ 13 నెలల పాటు నరకయాతన అనుభవించాం.
- నూకమ్మ, కె.మత్స్యలేశం.
పెళ్లయిన రెండేళ్లకే..
స్థానికంగా వేట గిట్టుబాటు కాకపోవడంతో నా భర్త ఎర్రయ్య గుజరాత్లోని వీరావల్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ చేపలవేట సాగిస్తూ పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కారు. మా సమీప బంధువులు ఐదుగురు కూడా పట్టుబడ్డారు. మాకు వివాహం జరిగి అప్పటికి రెండేళ్లు అయింది. ఆ సమయంలో నా బాధ వర్ణనాతీతం. అటువంటి బాధ మరెవరికీ రాకూడదు.
- శిరీష, కె.మత్స్యలేశం.
ఈ వార్తలు కూడా చదవండి:
NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..
Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు ఆమోదం
Updated Date - Feb 08 , 2025 | 10:43 AM