Weather : నిష్క్రమించిన ఈశాన్య రుతుపవనాలు
ABN, Publish Date - Jan 28 , 2025 | 06:16 AM
రుతుపవనాల నిష్క్రమణపై వారం రోజుల నుంచి పలు దఫాలు భారత వాతావరణ ప్రకటనలు చేస్తూ వచ్చింది. చివరికి ఈ విషయాన్ని సోమవారం నిర్ధారించింది.
వాతావరణ మార్పులతో కాస్త ఆలస్యం
ఏపీలో 10 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు
విశాఖపట్నం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): దక్షిణ భారతంలో ఐదు వాతావరణ సబ్ డివిజన్ల నుంచి సోమవారం ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించాయి. రుతుపవనాల నిష్క్రమణపై వారం రోజుల నుంచి పలు దఫాలు భారత వాతావరణ ప్రకటనలు చేస్తూ వచ్చింది. చివరికి ఈ విషయాన్ని సోమవారం నిర్ధారించింది. సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు 31 వరకుగల కాలాన్ని ఈశాన్య రుతుపవనాల సీజన్గా పరిగణిస్తారు. రుతుపవనాలు జనవరి వరకూ కొనసాగినా డిసెంబరు 31 వరకు కురిసిన వర్షాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం దక్షిణ భారతంలో తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో వర్షాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇంకా పొడి వాతావరణం నెలకొనడం, సముద్రం నుంచి తేమగాలులు తగ్గడంతో ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించినట్టుగా భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణాదిలోని ఐదు సబ్ డివిజన్లలో ఏడాదిలో కురిసే వర్షపాతంలో ఈశాన్య రుతుపవనాల సీజన్లోనే 30 శాతం నమోదవుతుంది. అదే ఒక్క తమిళనాడు తీసుకుంటే 48 శాతం వరకూ వర్షపాతం నమోదవుతుంది. ఈ ఏడాది అక్టోబరు 15న ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. సీజన్లో ఒక తీవ్ర తుఫాన్, ఒక తుఫాన్, మూడు వాయుగుండాలు, రెండు తీవ్ర అల్పపీడనాలు, రెండు అల్పపీడనాలు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్లో ఇలా..
రాష్ట్రం వరకూ చూస్తే ఈ సీజన్లో 286.5 మి.మీ.లకుగాను 316.5 (ప్లస్ 10 శాతం) మి.మీ. వర్షపాతం నమోదైంది. కోస్తాలో 322.3కి 292.3 మి.మీ (సాధారణం కంటే తొమ్మిది శాతం తక్కువ), రాయలసీమలో 235.7కి 344.4 మి.మీ. (46 శాతం ఎక్కువ) నమోదైంది. రాయలసీమలోని శ్రీసత్యసాయి జిల్లాలో 173.1 మి.మీ.కి 360.8 (108 శాతం ఎక్కువ) మి.మీ. నమోదు కాగా, కర్నూలులో 140.2కి 103.7 మి.మీ. (29 శాతం తక్కువ), కోస్తాలో నెల్లూరులో 574కి 736.6 మి.మీ. (28 శాతం ఎక్కువ) వర్షపాతం కురిసింది. ఉత్తరకోస్తాలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో తమిళనాడులో వరదలు ముంచెత్తాయి. అనేక జిల్లాల్లో సాధారణానికి మించి వర్షాలు కురవడంతో రిజర్వాయర్లు గరిష్ఠ స్థాయికి చేరాయి.
ఆలస్యం ఆగమనం, నిష్క్రమణ ఎందుకంటే...
వాతావరణ మార్పుల ప్రభావంతోనే ఈశాన్య రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడం, నిష్క్రమించడం జరుగుతుందని సంబంధిత అధికారి సముద్రాల జగన్నాథకుమార్ విశ్లేషించారు. సుమారు పదేళ్ల నుంచి నైరుతి, ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణలో జాప్యం జరుగుతుందన్నారు. నైరుతి రుతుపవనాలు వాయువ్య భారతం నుంచి నిర్ణీత తేదీ కంటే ఆలస్యంగా వైదొలిగే పరిస్థితులు నెలకొంటున్నాయని, ఆ ప్రభావం ఈశాన్య రుతుపవనాలపై పడుతోందని చెప్పారు. ఈశాన్య రుతుపవానాల సీజన్లో డిసెంబరు నెలలో బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడి తమిళనాడుపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషించారు. వాతావరణ ప్రభావంతో వేడెక్కిన సముద్రాల నుంచి వచ్చే గాలుల ప్రభావంతో తీర ప్రాంతాల్లో వర్షాల తీవ్రత పెరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిల్లో కురిసిన అతిభారీ వర్షాలే అందుకు నిదర్శనంగా పేర్కొన్నారు.
Updated Date - Jan 28 , 2025 | 06:17 AM