AP High Court : అరెస్ట్ నుంచి శ్రీరెడ్డికి రక్షణ
ABN, Publish Date - Feb 25 , 2025 | 06:14 AM
సినీ నటి శ్రీరెడ్డికి తక్షణ అరెస్ట్ నుంచి హైకోర్టు రక్షణ కల్పించింది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులపై అనుచిత పోస్టులు పెట్టిన...
అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో నమోదైన కేసులలో సినీ నటి శ్రీరెడ్డికి తక్షణ అరెస్ట్ నుంచి హైకోర్టు రక్షణ కల్పించింది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులపై అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 6 కేసులలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. చిత్తూరు వన్టౌన్ ఠాణా పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ బెయిలబుల్ స్వభావం ఉండటంతో శ్రీరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్కు విచారణార్హత లేదని స్పష్టం చేస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. విశాఖ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు పలు షరతులు విధించింది. రూ.10 వేలతో 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అలాగే కర్నూలు టూటౌన్, కృష్ణా జిల్లా గుడివాడ వన్టౌన్, విజయనగరం జిల్లా నెలిమర్ల రాణాలో నమోదైన కేసులలో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్ల లోపు శిక్షకు వీలున్నవేనని గుర్తు చేసింది. మరోవైపు గత ఏడాది నవంబరు 13న అనకాపల్లి పట్టణ రాణా పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ సందర్భంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయి రోహిత్ స్పందిస్తూ... పిటిషనర్ అసభ్యకర భాష వాడారని, రికార్డులు కోర్టు ముందు ఉంచుతామన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు స్పందిస్తూ... పోలీసులు కేసు నమోదు చేసిన తరువాత పిటిషనర్ ఎలాంటి పోస్టులు పెట్టడం లేదన్నారు.
Updated Date - Feb 25 , 2025 | 06:14 AM