Experts Meeting : డయాఫ్రం వాల్కు వాడే కాంక్రీట్ మిశ్రమంపై తేలని పంచాయితీ!
ABN, Publish Date - Jan 10 , 2025 | 05:32 AM
పోలవరం ప్రాజక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఉపయోగించే ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంపై నిపుణుల పంచాయితీ తెగలేదు.
టీ-16 మిశ్రమం వైపే వారి మొగ్గు
టీ-5 మిక్సర్ మేలన్న సీఎ్సఎంఆర్ఎస్
24 గంటల్లో లిఖితపూర్వకంగా అభిప్రాయం చెప్పాలన్న జలసంఘం
13వ తేదీన తుది నిర్ణయం?
అమరావతి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఉపయోగించే ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంపై నిపుణుల పంచాయితీ తెగలేదు. ఢిల్లీ వేదికగా గురువారం కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర సోయల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎ్సఎంఆర్ఎస్) అధికారులు, ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇందులో డేవిడ్ బ్రియాన్ పాల్, జియాన్ ఫ్రాంకో డి సిక్కో (అమెరికా), సీన్ హించ్బెర్గర్, చార్లెస్ రిచర్డ్ డొనెల్లీ(కెనడా) వర్చువల్గా పాల్గొన్నారు. రాష్ట్ర జల వనరుల శాఖ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు నరసింహమూర్తి, నిర్మాణ సంస్థలు బావర్, కెల్లర్, మేఘా ఇంజనీరింగ్ సంస్థల ప్రతినిధులు విజయవాడ, రాజమండ్రి నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు. ఈ భేటీలో నిపుణులు ఒక్కొక్కరూ ఒక్కో అభిప్రాయాన్ని వెల్లడించారు. వాటిని 24 గంటల్లోగా (శుక్రవారంనాటికి) లిఖితపూర్వకంగా సమర్పించాలని జల సంఘం స్పష్టం చేసింది. వాటిని తాము క్రోడీకరించుకుని ఏకాభిప్రాయానికి వస్తామని తెలిపింది. తమ నిర్ణయాన్ని సోమవారం నాటికి వెల్లడిస్తామని.. ఆ వెంటనే వాల్ నిర్మాణ పనులు చేపట్టాలని నిర్మాణ సంస్థ బావర్కు సూచించింది. ఒకవైపు.. యుద్ధప్రాతిపదికన ఈ వాల్ పనులు ప్రారంభించాలని చెబుతూనే.. మరోవైపు నిపుణుల అంగీకారం కావాలంటూ జలసంఘం షరతు విధించడం విమర్శలకు తావిస్తోంది. ముందుగా అనుకున్నట్లుగా ఈ నెల రెండో తేదీన పనులు ప్రారంభమై ఉంటే.. ఈపాటికి డయాఫ్రం వాల్ నిర్మాణ పనులకు ఒక రూపు వచ్చేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాగా.. ఈ సమావేశంలో.. ట్రయల్ టెస్ట్-16(టీ-16)గా పిలిచే కొత్త ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం వైపు అంతర్జాతీయ నిపుణులు కాస్త మొగ్గు చూపారు. సీఎ్సఎంఆర్ఎస్ ప్రతినిధులు మాత్రం పాత డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఉపయోగించిన టీ-5 మిశ్రమం వాడడం మేలని పేర్కొన్నారు. వాల్ డిజైన్లపైనా నిపుణులు, సీఎ్సఎంఆర్ఎస్ ప్రతినిధులు భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. అయితే.. ఈ డిజైన్లపై పెద్దగా సమస్యలు లేనప్పటికీ కాంక్రీట్ మిశ్రమంపైనే అభ్యంతరాలు కనిపించాయి. దీనిపై వారు లిఖితపూర్వకంగా నివేదికలను అందిస్తే.. వాటిని అధ్యయనం చేశాక సోమవారం నాటికి కేంద్ర జల సంఘం చివరిగా .. వాడాల్సిన కాంక్రీట్ మిశ్రమంపై స్పష్టత ఇస్తుందని జల వనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు. డయాఫ్రం పనులు ఎప్పుడు ప్రారంభించేదీ సోమవారం నాటికి గానీ తేలదని భావిస్తున్నారు.
Updated Date - Jan 10 , 2025 | 05:32 AM