AP High Court : టీచర్ల పనితీరు మదింపు
ABN, Publish Date - Feb 19 , 2025 | 03:17 AM
విద్యాహక్కు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా టీచర్ల పనితీరును అంచనా వేయాలని ఆదేశించింది.
విద్యార్థుల కనీస అభ్యసన పరిజ్ఞానానికి టీచర్లనే బాధ్యులుగా చేయాలి
తద్వారా మెరుగైన విద్యా ప్రమాణాలు
ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయండి
పాఠశాల విద్యాశాఖకు హైకోర్టు ఆదేశం
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రాథమిక విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాహక్కు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా టీచర్ల పనితీరును అంచనా వేయాలని ఆదేశించింది. దీనికి వీలుగా జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ)ని సంప్రదించి 6నెలల్లో సూచికలు రూపొందించాలని పేర్కొంది. విద్యార్థుల అభ్యాసనా సామర్థ్యం కనీస స్థాయిలో లేకపోవడానికి టీచర్లను బాధ్యులను చేయడంవల్ల దీర్ఘకాలంలో విద్యా ప్రమాణాలు పెరుగుతాయని అభిప్రాయపడింది. విద్యాహక్కు చట్టంలోని నిబంధన 25(2)(డీ) ప్రకారం జవాబుదారీతనం, పనితీరులపై సూచికలు తయారు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. అలాగే, 25(2)(ఈ) ప్రకారం ఉపాధ్యాయులు, అధికారుల వ్యవస్థ పనితీరును నిర్దిష్ట కాలంలో మదింపు చేయాలని తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన ప్రాఽథమిక విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. విద్యార్థుల అధ్యయన, అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించేందుకు విద్యాహక్కు చట్టం, ఎస్సీఈఆర్టీ నిబంధనల మేరకు నిర్వహించిన బేస్లైన్, టీఏఆర్ఎల్(టీచింగ్ ఎట్ రైట్ లెవల్ టెస్ట్) ఫలితాలను గత ప్రభుత్వం బహిర్గతం చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఇంద్రనీల్బాబు వాదనలు వినిపించారు. విద్యార్థులు చదివే సామర్ధ్యాన్ని కోల్పోతున్నారని, ఐదవ తరగతి విద్యార్థి రెండో తరగతి పాఠ్యాంశాన్ని కూడా చదవలేకపోతున్నాడని తెలిపారు. బేస్లైన్, టీఏఆర్ఎల్ టెస్ట్ల వివరాలను తల్లిదండ్రులకు అందజేయడం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.
Updated Date - Feb 19 , 2025 | 03:17 AM