Gorantla Madhav : మాధవా.. ఏమిటిదంతా..!
ABN, Publish Date - Mar 06 , 2025 | 12:56 AM
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగరంలో హంగామా చేశారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట బుధవారం హాజరు కావాల్సిన ఆయన.. తన ఇంటి వద్దకు ఉదయం పదుల సంఖ్యలో కార్లను తెప్పించుకున్నారు. అనుచరులతో డీజిల్, పెట్రోల్ పట్టించారు. వాటిని పల్లెలకు పంపి జనాలను రప్పించుకున్నారు. ఇంటి వద్ద షామియానా ఏర్పాటు చేసి.. భోజనం పెట్టారు. మాజీ ఎంపీ రంగయ్య, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ...
వాహనాలతో జన సమీకరణ
విజయవాడకు వెళ్లకుండా.. విందు
కాన్వాయ్తో నగరంలో హల్చల్
విప్లవం తప్పదని మరోమారు బీరాలు
అనంతపురం క్రైం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగరంలో హంగామా చేశారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట బుధవారం హాజరు కావాల్సిన ఆయన.. తన ఇంటి వద్దకు ఉదయం పదుల సంఖ్యలో కార్లను తెప్పించుకున్నారు. అనుచరులతో డీజిల్, పెట్రోల్ పట్టించారు. వాటిని పల్లెలకు పంపి జనాలను రప్పించుకున్నారు. ఇంటి వద్ద షామియానా ఏర్పాటు చేసి.. భోజనం పెట్టారు. మాజీ ఎంపీ రంగయ్య, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, వైసీపీ నాయకులు మహానందరెడ్డి, ధనుంజయ యాదవ్ తదితరులు ఆయన ఇంటి వద్దకు వచ్చారు. అనంతరం మాధవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడి, భారీ కాన్వాయ్తో బయలుదేరారు. జడ్పీ కార్యాలయం వద్ద వైఎస్సార్,
అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన తీరుతో ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడి నుంచి గుత్తిరోడ్డు మీదుగా వెళ్లి సోములదొడ్డి వరకు వెళ్లారు. పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో అక్కడి నుంచి మూడు, నాలుగు వాహనాలు మినహా అన్నీ వెనుదిరిగాయి.
విప్లవం తప్పదు..
ఇంటి నుంచి బయలుదేరేముందు మాధవ్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పౌరుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రభుత్వం తిరుగుబాటు, విప్లవం తప్పదని అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తే... న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుర్కొంటామని అన్నారు. పోలీసు విచారణకు వెళతానని, చట్టాలను గౌరవిస్తానని అన్నారు. వర్క్లోడ్ కారణంగా విజయవాడకు వెళ్లడం ఆలస్యమైందని అన్నారు. ఈ రోజు లేదా రేపు విజయవాడ చేరుకుంటానని అన్నారు. సైబర్ క్రైం పోలీ్సస్టేషనకు వెళ్లి సీఐ ఎదుట విచారణకు హాజరవుతానని అన్నారు. తొమ్మిది నెలల్లోనే సంక్షేమ పథకాల వైపు చూడకుండా అరెస్టులపై టీడీపీని నడుపుతున్నారని విమర్శించారు. ఎప్పుడో మూడు నాలుగేళ్ల నాటి కేసులో నోటీసిచ్చారని, దీనికి సంజాయిషీ ఇస్తానని అన్నారు. రేపు అనేది ఒకటి ఉంటుందని, అప్పుడు కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. రూల్ ఆఫ్ లా అందరికీ ఒకేలా వర్తింపజేయాలని మాజీ ఎంపీ రంగయ్య అన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్షించాలని అన్నారు. అధికారపార్టీలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా చూడకూడదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోక్సో కేసు బాధితుల పేర్లు చెప్పిన అందరికీ నోటీసులివ్వాలని డిమాండ్ చేశారు.
మూమెంట్స్ తగ్గించుకోప్పా..
బహిరంగంగా తిరగడాన్ని తగ్గించుకోవాలని వైసీపీ నాయకుడు మహానందరెడ్డిని వనటౌన పోలీసులు హెచ్చరించారు. సీఐ రాజేంద్రనాథ్ యాదవ్... మహానందరెడ్డిని బుధవారం సాయంత్రం స్టేషనకు పిలిపించారు. వర్గాలతో కలిసి బయట తిరగడాన్ని తగ్గించుకోవాలని సూచించారు. గనమెన కూడా లేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, అనుచరులు, వర్గాలతో తిరగడం సరికాదని చెప్పినట్లు సమాచారం. ఏదైనా వివాదం తలెత్తితే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. మహానందరెడ్డికి గత ఏడాది డిసెంబరులో గనమెనను తొలగించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - Mar 06 , 2025 | 12:57 AM