T. Gangadhar: ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ ఇన్ చార్జ్ వీసీగా గంగాధర్
ABN, Publish Date - Dec 08 , 2024 | 04:02 AM
జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇన్చార్జి ఉపకులపతి (వీసీ)గా ప్రొఫెసర్ టి.గంగాధర్ను ప్రభుత్వం నియమించింది. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసింది ఈయనే.
తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తకు పదవి
ప్రస్తుతం ఫైన్స్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్
తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తను కీలక పదవిలో నియమించిన సర్కారు
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇన్చార్జి ఉపకులపతి (వీసీ)గా ప్రొఫెసర్ టి.గంగాధర్ను ప్రభుత్వం నియమించింది. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసింది ఈయనే. ఈ నెల 9న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణకు రెండు రోజుల ముందు గంగాధర్ను కీలక పదవితో ప్రభుత్వం సత్కరించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్ శనివారం జీవో జారీ చేశారు. ప్రస్తుతం వర్సిటీలోని ఫైన్స్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా గంగాధర్ పని చేస్తున్నారు. మరోవైపు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
చక్రపాణి గతంలో అంబేడ్కర్ విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్గా, వివిధ పరిపాలనా పదవుల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటి చైర్మన్గా సేవలు అందించారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. గతంలో తనకు కేసీఆర్ అవకాశం ఇచ్చారని, ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి పిలిచి అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. వాస్తవానికి ఒక ప్రభుత్వానికి దగ్గర ఉన్న వ్యక్తి వేరే ప్రభుత్వానికి దూరంగా ఉంటారని, తాను తెలంగాణకు దగ్గరి వ్యక్తిని అయినందుకే ఇప్పుడు ఉపకులపతిగా అవకాశం వచ్చిందన్నారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని నంబర్ వన్గా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. యూనివర్సిటీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తాను ఇక్కడ 30 ఏళ్లు పని చేశానని చెప్పారు. కాగా, అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇన్చార్జి రిజిస్ర్టార్గా ఎల్.విజయక్రిష్ణారెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. వర్సిటీ విద్యార్థి సేవల ఇన్చార్జి డైరెక్టర్గా వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. పరీక్షల అదనపు కంట్రోలర్గా దయాకర్ నియమితులయ్యారు.
ఇన్చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించిన బాలకిష్టారెడ్డి
జేఎన్టీయూ నూతన ఇన్చార్జి వైస్చాన్స్లర్గా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వివిధ విభాగాల డైరెక్టర్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమై ఆయా విభాగాల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ వీసీ కట్టా నర్సింహారెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన కొన్ని డైరెక్టరేట్లకు పెట్టిన పేర్లు బాగా లేవని, మూడు విభాగాల పేర్లను మార్చాలని నిర్ణయించారు. న్యాయశాస్త్రానికి సంబంధించిన కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతున్నందున కొన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. రెగ్యులర్ వైస్ చాన్స్లర్ వచ్చేవరకు ఇన్చార్జ్ వీసీ (మరో రెండు నెలలపాటు)గా యూనివర్సిటీ అభివృద్ధికి తన సహకారాన్ని అందిస్తానని బాలకిష్టారెడ్డి స్పష్టంచేశారు. జేఎన్టీయూను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో రెక్టార్ విజయకుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, వర్సిటీ డైరెక్టర్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
Updated Date - Dec 08 , 2024 | 04:02 AM