Mahesh Kumar Goud: చేసింది చెప్పుకోకుంటే వెనకబడతాం..
ABN, Publish Date - Dec 01 , 2024 | 03:29 AM
ప్రభుత్వ పథకాలు, చేస్తున్న మంచి పనులను గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఆదివాసీ కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ సూచించారు.
సర్కారు పథకాలు ప్రచారం చేయండి
దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి: మహేశ్ గౌడ్
హైదరాబాద్/న్యూఢిల్లీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాలు, చేస్తున్న మంచి పనులను గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఆదివాసీ కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ సూచించారు. చేసిన పనులను చెప్పుకోక పోతే వెనుకపడిపోతామన్నారు. ప్రభుత్వంపైన బీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని చెప్పారు. శనివారం గాంధీభవన్లో ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ అధ్యక్షతన జరగ్గా.. అందులో మహేశ్గౌడ్ మాట్లాడారు. పార్టీలో కష్టపడిన నాయకులకు అన్ని రకాల పదవుల్లో వారికి అవకాశమిస్తామని హామీనిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తున్నా.. బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తూ కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ మతతత్వ ప్రచారాన్ని, మోదీ అబద్ధాలను తిప్పి కొట్టాలన్నారు. ఏఐసీసీ నేత కొప్పుల రాజు మాట్లాడుతూ ఆదివాసీ అంశాలపై లోతుగా చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు నాగార్జునసాగర్లో వారం రోజుల పాటు క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, ప్రజాపాలన విజయోత్సవాలను పార్టీ తరఫున సమన్వయం చేసుకునేందుకు 119 నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లను టీపీసీసీ నియమించింది.
గురుకులాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుట్ర..
రాష్ట్రంలోని గురుకులాలపై ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పెద్ద కుట్రకు పాల్పడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఆయన గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు నియమించుకున్న మనుషులతో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గురుకుల విద్యార్థులకు సీఎం రేవంత్రెడ్డి 40 శాతం డైట్ చార్జీలు పెంచి మంచి భోజనం అందిస్తుంటే.. ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని అయిలయ్య దుయ్యబట్టారు. స్వేరో పేరుతో ఆర్ఎస్ ప్రవీణ్ ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసుకున్నారంటూ గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు నిజమేననిపిస్తుందని సత్యం అన్నారు. గురుకులాలపై కుట్రలు చేసినందుకు ఆర్ఎస్ ప్రవీణ్ విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓబీసీలకు న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ బీసీలకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - Dec 01 , 2024 | 03:29 AM