Temple Revenue: గుడిని బట్టి నిధి
ABN, Publish Date - Oct 08 , 2024 | 03:14 AM
రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు వచ్చే ఆదాయం ఆధారంగా వాటి నుంచి నిధులు అధికంగా సేకరించి.. ఆ మొత్తాన్ని కామన్ గుడ్ ఫండ్కు (సర్వ శ్రేయో నిధి-సీజీఎఫ్) జమచేయడంపై దేవాదాయ శాఖ అధికారులు దృష్టిసారించారు.
ఆదాయం ప్రకారం సీజీఎఫ్ వసూలుకు ప్రతిపాదన!
కామన్ గుడ్ ఫండ్ కోసం ప్రజాప్రతినిధుల అభ్యర్థనలు
భారీగా సమీకరించేందుకు ఆలయాలపై అధికార్ల చూపు
కనిష్ఠంగా 7 శాతం నుంచి గరిష్ఠంగా 12 శాతం దాకా..
మఠాల నుంచి ఐదు శాతం ఇవ్వలేమంటున్న ఈవోలు
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు వచ్చే ఆదాయం ఆధారంగా వాటి నుంచి నిధులు అధికంగా సేకరించి.. ఆ మొత్తాన్ని కామన్ గుడ్ ఫండ్కు (సర్వ శ్రేయో నిధి-సీజీఎఫ్) జమచేయడంపై దేవాదాయ శాఖ అధికారులు దృష్టిసారించారు. పురాతన ఆలయాల మరమ్మతులు, కొత్త ఆలయాలు నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం ఈ నిధిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల ఆదాయం నుంచి ప్రతి నెలా 5 శాతం నిధులను ఈ సీజీఎ్ఫకు జమచేస్తారు. సాధారణ భక్తులు, ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే అభ్యర్థనలు, సిఫారసుల ఆధారంగా ఈ నిధులను కేటాయిస్తారు.
అయితే, ఇటీవలికాలంలో ఈ నిధుల కోసం ప్రజాప్రతినిధుల నుంచి ఎక్కువగా అభ్యర్ధనలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లుగా మంజూరు చేసేందుకు ప్రస్తుతం సీజీఎ్ఫలో ఉన్న నిధులు సర్దుబాటు అయ్యే పరిస్థితి లేదు. దీంతో.. ఆలయాల నుంచి అధిక నిధులు సేకరించడంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇప్పటిదాకా ఉన్న 5 శాతానికి బదులుగా.. ఆలయాల ఆదాయాన్ని బట్టి కనిష్ఠంగా 7 శాతం నుంచి గరిష్ఠంగా 12 శాతం దాకా సీజీఎఫ్ వాటా కింద వసూలు చేయాలని ప్రతిపాదించారు.
వార్షిక ఆదాయం రూ.25 లక్షలు, అంతకు మించి ఆదాయం కలిగిన 6ఏ ఆలయాలు 12 శాతం,
రూ.2 లక్షల నుంచి రూ. 25 లక్షల ఆదాయం కలిగిన 6బీ ఆలయాలు 10ు,
రూ.2 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన 6సీ ఆలయాలు 7ు,
ఆదాయంతో సంబంధం లేకుండా 6డీ పరిధిలోకి వచ్చే మఠాలు 5 శాతం సీజీఎఫ్ వాటాగా ఇవ్వాలని పేర్కొన్నారు.
కుదరదంటున్న ఈవోలు..
ఆలయాలకు వస్తున్న ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటోందని.. అది కూడా అర్చకులు, ఉద్యోగులకు వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులకే సరిపోతోందని.. కాబట్టి, సీజీఎ్ఫకు నిధులు పెంచి ఇవ్వడం కుదరదని ఈవోలు ఉన్నతాధికారులకు తెగేసి చెబుతున్నారు. వాస్తవానికి ఇదే ప్రయత్నం గత ప్రభుత్వ హయాంలోనూ చేసినా.. క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత రావడంతో విరమించుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి సీజీఎఫ్ అంశాన్ని ఉన్నతాధికారులు తెరపైకి తెచ్చారు. దీనిపై అన్ని ఆలయాల ఈవోలతో దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఇటీవల ప్రత్యేకంగా సమావేశమై చర్చించగా ఎవరూ సీజీఎఫ్ పెంచి చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.
అజమాయిషీ కరువు..
సీజీఎఫ్ నిధుల వాడకంపై దేవాదాయశాఖ అజమాయిషీ లేకుండా పోతోంది. ఆదాయం ఉన్న ఆలయాల నుంచి ముక్కుపిండి సీజీఎఫ్ వసూలు చేస్తున్నా... అవి వినియోగిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కేవలం రాజకీయ నాయకుల పలుకుబడి, వారి అనుచరులకు కాంట్రాక్టులకు మాత్రమే సీజీఎఫ్ నిధులు ఉపయోగపడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయాల మరమ్మత్తులు, కొత్తవాటి నిర్మాణానికి గరిష్ఠంగా రూ. 50 లక్షలకు మించి ఇవ్వరాదనే నిబంధన ఉంది. ఆలయ నిర్మాణం చేపట్టేవారు తమ వాటాగా 30 శాతం నిధులను ముందు గా చెల్లించి, ఆ తర్వాత ఆ తర్వాత దేవాదాయ శాఖ నుంచి మిగతా మొత్తం తీసుకోవాలి. కానీ వాస్తవంగా అలా జరగట్లేదు.
మాజీ సీఎం కేసీఆర్.. గజ్వేల్ నియోజకర్గంలో రామాలయ మరమ్మతులకు ఇలా రూ.5 కోట్లు వాడారు. నిర్మల్లో అడెల్లి మహాపోచమ్మ ఆలయ మరమ్మతులకు రూ.6 కోట్లు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2, 3 ఆలయాలకు కోట్లల్లో సీజీఎఫ్ నిధులు మంజూరు చేశారు. దేవాదాయ శాఖ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నియోజకవర్గంలో.. రాష్ట్రంలోనే అత్యధికంగా పదేళ్లలో సుమారు 800 ఆలయాలకు సీజీఎఫ్ నిధులు మంజూరయ్యాయి.
Updated Date - Oct 08 , 2024 | 03:14 AM