Congress: బీఆర్ఎస్కు కోలుకోలేని షాక్.. కాంగ్రెస్లోకి కీలక నేత!
ABN, Publish Date - Feb 11 , 2024 | 05:54 PM
Big Shock To BRS: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ మాజీ మేయర్, బీఆర్ఎస్ కీలక నేత బొంతు రామ్మోహన్ ‘కారు’ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో రామ్మోహన్ భేటీ కాబోతున్నారు..
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ మాజీ మేయర్, బీఆర్ఎస్ కీలక నేత బొంతు రామ్మోహన్ ‘కారు’ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో రామ్మోహన్ భేటీ కాబోతున్నారు. కాంగ్రెస్లో చేరికపై సీఎంతో చర్చించబోతున్నారు. త్వరలోనే తన అనుచరులు, నియోజకవర్గ నేతలతో కలిసి ‘కారు’ దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా.. బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బొంతు రామ్మోహన్.. జీహెచ్ఎంసీ మేయర్గా పనిచేసిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్లోకి వెళితే..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డ బొంతు రామ్మోహన్ నాటి నుంచి పార్టీతో అంటీ ముట్టన్నట్లుగానే ఉంటూ వస్తున్నారు. అప్పట్లోనే పార్టీ మారుతారని ప్రచారం జరిగినప్పటికీ జంప్ చేసినా ఎక్కడా ఉప్పల్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మిన్నకుండిపోయారు. అయితే పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయడానికి బొంతు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్లో కూడా ఈ నియోజకవర్గానికి గట్టిపోటీనే ఉంది. అయితే.. బీఆర్ఎస్లో మల్కాజ్గిరి టికెట్ కోసం మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు. తన కుమారుడ్ని పోటీ చేయించాలని ప్లాన్లో ఉన్నారు. దీంతో టికెట్ అడిగినా ఇచ్చే పరిస్థితి లేదని.. అటు ఎమ్మెల్యే .. ఇటు ఎంపీ టికెట్ లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రామ్మోహన్ ఇక పార్టీలో ఉండి ఫలితం లేదని కాంగ్రెస్లో చేరాలని అనుచరులతో చర్చించి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే సిటీకి చెందిన బీఆర్ఎస్ ముఖ్యనేతలు, కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
నిన్న బాబు.. నేడు బొంతు..!
భాగ్యనగర గులాబీ పార్టీలో సుదీర్ఘకాలంగా క్రియాశీల కార్యకర్తగా, నేతగా కొనసాగుతున్న మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఇటీవలే బీఆర్ఎస్కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. 2022లో విద్యార్థి దశలో ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చినప్పుడు ఆకర్షితుడైన ఫసియుద్దీన్ అందులో చేరారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. 22 ఏళ్లుగా పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నప్పటికీ.. అగ్రనాయకులు తనను పట్టించుకోవడం లేదని ఆవేదనకు గురైన బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. అయితే ఈయన చేరిన రోజుల వ్యవధిలోనే బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.
Updated Date - Feb 11 , 2024 | 05:54 PM