Nara Lokesh : ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
ABN, Publish Date - Dec 04 , 2024 | 05:33 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రి లోకేశ్ నిర్ణయించారు.
చాగంటి సూచనల మేరకు నైతిక విలువలపై పాఠ్యాంశాలు: లోకేశ్
అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రి లోకేశ్ నిర్ణయించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడారు. ‘పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాపౌట్స్ని కొంత మేర తగ్గించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబరు 7న నిర్వహించే మెగా పేరంట్-టీచర్ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలి. బాపట్ల ప్రభుత్వ హైస్కూల్లో నిర్వహించే మెగా పీటీఎంకు సీఎం చంద్రబాబుతో పాటు నేను కూడా హాజరవుతున్నా. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా స్టార్ రేటింగ్ ఇవ్వాలి. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు పాఠ్యాంశాల కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలి. స్కూల్ మైదానాలను జాబ్ మేళాలకు మినహా ఎలాంటి కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇవ్వరాదు’ అని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు, ఇంటర్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు.
Updated Date - Dec 04 , 2024 | 05:33 AM