MLC Duvvarapu Rama Rao : ‘బొత్స’ డ్రైవర్ బెదిరిస్తున్నాడు
ABN, Publish Date - Dec 24 , 2024 | 04:56 AM
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కారు డ్రైవర్ తమ భూములకు ఆన్లైన్లో పేర్లు మార్చి, బెదిరిస్తున్నాడని ఓ మహిళ వాపోయింది.
కృష్ణసాయి గ్రానైట్స్ పేరుతో దోపిడీ... టీడీపీ గ్రీవెన్స్లో ఫిర్యాదులు
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కారు డ్రైవర్ తమ భూములకు ఆన్లైన్లో పేర్లు మార్చి, బెదిరిస్తున్నాడని ఓ మహిళ వాపోయింది. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, కుడా చైర్మన్ సోమిరెడ్డి వెంకటేశ్వర్లు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ‘తమకు వారసత్వంగా సక్రమించిన భూమిని బొత్స కారు డ్రైవర్ అక్రమంగా కొట్టేసేందుకు ఆన్లైన్లో పేర్లు మార్పించి, తమనే బెదిరిస్తున్నాడని విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన మల్లాప్రగడ సరస్వతి వాపోయారు. ప్రభుత్వం తనకిచ్చిన భూమికి వీఆర్వో లంచం తీసుకుని, అక్రమంగా మరొకరికి పాస్పుస్తకాలు ఇచ్చాడని పల్నాడు జిల్లా రాజుపాలెం మండలానికి చెందిన సకినాల కృష్ణ ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని కృష్ణసాయి గ్రానైట్స్ పేరుతో జరుగుతున్న మైనింగ్ దోపిడీపై విచారణ జరిపి, వారు దోచుకున్న రూ.1,690కోట్లను రికవరీ చేయాలని ముప్పురి రంగారావు విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలతో అంటకాగుతున్న మున్సిపల్ అధికారులు తమ స్థలంలో నిర్మించుకున్న దుకాణాలను కూల్చివేశారని, కోర్టు ఆర్డర్ ఉన్నా పట్టించుకోలేదని అన్నమయ్య జిల్లా బీ కొత్తకోటకు చెందిన మోమీన్ వాపోయారు. తమకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కొందరు కబ్జా చేశారని బాపట్ల జిల్లా జంపనికి చెందిన కుమ్మరి సంఘ సభ్యులు వాపోయారు.దివ్యాంగురాలినైన తన భూమిని దొంగ పత్రాలతో కబ్జా చేశారని అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లికి చెందిన షేక్ షహీరా వాపోయారు.
Updated Date - Dec 24 , 2024 | 04:58 AM