MLA: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
ABN, Publish Date - Dec 22 , 2023 | 07:32 AM
టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు, ఈరోడ్ శాసనసభ్యుడు ఈవీకేఎస్ ఇలంగోవన్(EVKS Ilangovan) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
చెన్నై, (ఆంధ్రజ్యోతి): టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు, ఈరోడ్ శాసనసభ్యుడు ఈవీకేఎస్ ఇలంగోవన్(EVKS Ilangovan) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయనను స్థానిక పోరూరులో మియాట్ ఆస్పత్రిలో చేర్చారు. గురువారం ఇలంగోవన్ జన్మదినం కావడం విశేషం. రెండేళ్లకు మునుపు ఇలంగోవన్ కుమారుడు మృతి చెందటంతో ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొనడం మానుకున్నారు. అయినా ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు జన్మదినం రోజున సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఈరోడ్(Erode)లో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి తిరిగి చేరుకున్నారు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఆయనకు జ్వరం వచ్చింది. గురువారం వేకువజాము జ్వరం తీవ్రం కావటంతో ఆయన చెన్నై చేరుకుని మియాట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వైద్యనిపుణులు ఆయనకు ప్రత్యేక చికిత్సలందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు ఇలంగోవన్ జన్మదిన వేడుకల సందర్భంగా సంక్షేమ కార్యక్రమాలను ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు. కొన్నిచోట్లా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నిరుపేదలకు అన్నదానం, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Updated Date - Dec 22 , 2023 | 07:32 AM