2024 Lok Sabha elections : రానున్న ఎన్నికలకు టార్గెట్ పెంచేసిన బీజేపీ
ABN, First Publish Date - 2023-07-16T13:57:55+05:30
భారతీయ జనతా పార్టీ (BJP) మరింత ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో సాధించిన స్థానాల కన్నా ఎక్కువ స్థానాలను 2024 లోక్సభ ఎన్నికల్లో సంపాదించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మరికొందరు ముఖ్య నేతల కంచుకోటల్లో పాగా వేయడం కోసం వ్యూహాలు రచిస్తోంది.
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (BJP) మరింత ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో సాధించిన స్థానాల కన్నా ఎక్కువ స్థానాలను 2024 లోక్సభ ఎన్నికల్లో సంపాదించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మరికొందరు ముఖ్య నేతల కంచుకోటల్లో పాగా వేయడం కోసం వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత స్థానాల్లో మరింత బలోపేతమవుతూ, గతంలో గెలవని స్థానాల్లో కూడా సత్ఫలితాలు సాధించేందుకు ప్రయత్నిస్తోంది.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, 2019 లోక్సభ ఎన్నికల్లో దాదాపు 38 శాతం ఓట్లతో 303 స్థానాలను దక్కించుకున్న బీజేపీ రానున్న లోక్సభ ఎన్నికల్లో కనీసం 350 స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన కోసం అనేక వ్యూహాలతో దూసుకెళ్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలను సాధించలేకపోయిన చోట్ల ఈసారి మరింత పట్టు బిగించి, విజయ దుందుభి మ్రోగించాలని ప్రయత్నిస్తోంది.
టార్గెట్ 350 కోసం బీజేపీ ముందుగా ఓ జాబితాను రూపొందించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటమిపాలై, రెండో స్థానంలో నిలిచిన లేదా స్వల్ప తేడాతో పరాజయం పొందిన స్థానాల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో 160 స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో రెండు నుంచి నాలుగు నియోజకవర్గాలను ఓ క్లస్టర్గా విభజించి, కేంద్ర మంత్రులకు, పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. రాష్ట్ర స్థాయిలో సమన్వయకర్తలు, సహ సమన్వయకర్తలను నియమించారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను వీరికి అప్పగించారు. ఈ స్థానాలన్నిటిలోనూ బీజేపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, వినోద్ తావడే, తరుణ్ చుగ్లకు అప్పగించారు. ఇప్పటి వరకు వీరంతా ఏమేం చేశారో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవలే సమీక్షించారు. క్లస్టర్ ఇన్ఛార్జిలకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ 160 స్థానాలు మాత్రమే కాకుండా మిగిలిన లోక్సభ స్థానాల్లోనూ గెలుపు కోసం కృషి చేస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విభజించి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంది. తూర్పు ప్రాంతంలోకి బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర వచ్చాయి. ఉత్తర ప్రాంతంలోకి ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, ఢిల్లీ, జమ్మూ-కశ్మీరు, లడఖ్, చండీగఢ్, డామన్ డయ్యూ-దాద్రా నగర్ హవేలీ వచ్చాయి. దక్షిణ ప్రాంతంలోకి కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా, అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి వచ్చాయి.
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో పరాజయం ఎదురవడంతో బీజేపీ ఆ రాష్ట్రంపై మరింత ఎక్కువగా దృష్టి సారించింది. అదేవిధంగా తెలంగాణలో మరిన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఖాతా తెరిచేందుకు ప్రయత్నిస్తోంది.
ఇవి కూడా చదవండి :
S Jaishankar : ఉత్తమ దౌత్యవేత్త హనుమంతుడు : ఎస్ జైశంకర్
Yamuna Floods : ఢిల్లీలో మళ్లీ కురుస్తున్న వర్షాలు.. యమునా నదిలో ప్రమాద స్థాయి దాటిన నీటి మట్టం..
Updated Date - 2023-07-16T13:57:55+05:30 IST