Vijayasai Reddy: విశాఖ ఉక్కుకు భూములు బదలాయించం
ABN, Publish Date - Dec 18 , 2023 | 10:55 PM
విశాఖ ఉక్కుకు భూములు బదలాయించమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) స్పష్టం చేశారు. సోమవారం నాడు రాజ్యసభలో విశాఖ ఉక్కుపై వాడివేడిగా చర్చలు జరిగాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సేకరించిన భూములను ఆ కర్మాగారానికి బదిలీ చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఉక్కు శాఖ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే స్పష్టం చేశారు.
ఢిల్లీ: విశాఖ ఉక్కుకు భూములు బదలాయించమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) స్పష్టం చేశారు. సోమవారం నాడు రాజ్యసభలో విశాఖ ఉక్కుపై వాడివేడిగా చర్చలు జరిగాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సేకరించిన భూములను ఆ కర్మాగారానికి బదిలీ చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఉక్కు శాఖ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే స్పష్టం చేశారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఫగన్ సింగ్ రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం సేకరించిన భూములను ఆ ప్లాంట్కు బదలాయించడం ద్వారా దాని ఆస్తుల విలువను, రుణ శక్తిని పెంపొందించడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుకు నిరాకరించడానికి కారణాలు ఏమిటని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి వివరణ ఇస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం భూములను సేకరించి అప్పగించింది.
తదనంతరం ఆ భూములపై సర్వహక్కులను కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు బదలాయించడం జరిగింది. స్టీల్ ప్రాజెక్ట్ కోసం ఆ భూములను వినియోగించుకోవడానికి వీలుగా ఉక్కు మంత్రిత్వ శాఖ ఆర్ఐఎన్ఎల్కు పవర్ ఆఫ్ అటార్నీ జారీ చేసింది. దీంతో ఆ భూములపై యాజమాన్య హక్కులను ఆర్ఐఎన్ఎల్కు బదిలీ చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి స్పష్టం చేశారు.రౌర్కెలా స్టీల్ ప్లాంట్ మినహా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) దేశంలోని వివిధ ప్రాంతాలల్లో నెలకొల్పిన స్టీల్ ప్లాంట్ల భూములపై సర్వహక్కులు ఆయా ప్లాంట్ల పేరిట దాఖలు పడి ఉన్నట్లు ఉక్కు శాఖ మంత్రి తెలిపారు. భిలాయ్ స్టీల్ ప్లాంట్, బొకారో స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్, ఇస్కో స్టీల్ ప్లాంట్, సేలం స్టీల్ ప్లాంట్ అలాయ్ స్టీల్ ప్లాంట్, విశ్వేశ్వరయ ఐరన్, స్టీల్ ప్లాంట్లు నెలకొల్పిన భూములకు ఆయా ప్లాంట్లే యాజమాన్య హక్కులు కలిగి ఉన్నాయి. రౌర్కెలా స్టీల్ ప్లాంట్ భూములు మాత్రం లీజు పద్ధతిలో కొనసాగుతున్నాయని ఉక్కు శాఖ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే పేర్కొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 10:55 PM