Ashok Babu: ఆ ఓటర్ లిస్ట్ నిండా అవకతవకలే..
ABN, First Publish Date - 2023-11-04T21:48:06+05:30
ఎన్నికల సంఘం అక్టోబర్ 27వ తేదీన విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ నిండా అవకతవకలే ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ( MLC Paruchuri Ashok Babu ) అన్నారు.
అమరావతి: ఎన్నికల సంఘం అక్టోబర్ 27వ తేదీన విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ నిండా అవకతవకలే ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ( MLC Paruchuri Ashok Babu ) అన్నారు. శనివారం నాడు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘‘అనేక నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల వివరాలు లేవు. ఒక్కో బూత్కు ఇన్ని ఓట్లు తొలగించాలనే లక్ష్యంతో వలంటీర్లు, అధికారులు పనిచేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఓట్లను బంగారం కంటే మిన్నగా కాపాడేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. టీడీపీకి పోలయ్యే ఓట్లు.. న్యూట్రల్ ఓట్లు తొలగించడానికి తాడేపల్లి ప్యాలెస్లో ఒక పెద్ద బృందమే పనిచేస్తోంది. ఆ బృందం ఆదేశాలతో .. వీఆర్ఏలు, బీ.ఎల్.వోలు, వలంటీర్లు వారి సొంత ఇళ్లల్లో పెళ్లికి పనిచేసినట్టుగా ప్రణాళికా బద్ధంగా ఓట్లను తొలగిస్తున్నారు. కొవ్వూరులో ప్రభావతి అనే వీఆర్ఏ 13 మంది చనిపోయినట్టు ఫామ్-7లు మంజూరు చేసి సస్పెండ్ అయ్యింది. కొన్నిచోట్ల కలెక్టర్లే వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. ఎవరైనా సరే తప్పుచేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం రాష్ట్రంలో 4కోట్ల పైచిలుకు ఓట్లుంటే...వాటిలో 15 లక్షల ఓట్లు యాడ్ చేస్తే.. 13 లక్షలు తొలగించారు. 6.50 లక్షల ఓట్లను అదర్ ఎన్రోల్మెంట్ కింద చూపారు.. అదర్ ఎన్రోల్మెంట్ అంటే ఏమిటో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఓట్లు ఉంటే.. ఆధార్ సీడింగ్ ప్రకారం బీ.ఎల్.వోలు తొలగించే ఓట్లపై కూడా కమిషన్ దృష్టిపెట్టాలి. టీడీపీ ఫిర్యాదులపై, అధికారుల తీరుపై, వైసీపీ ఎమ్మెల్యేల ఆదేశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలి. విశాఖపట్నం, చీరాలలో తొలగించిన ఓట్లపై టీడీపీ 2020లో ఫిర్యాదుచేస్తే నేటీకి చర్యలు లేవంటే ఏమనుకోవాలి..? ఓటరు జాబితాలో వలంటీర్లు వేలు పెట్టడాన్ని ఈసీ సీరియస్గా తీసుకోవాలి. నిజమైన ఓట్లు కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎంతదూరమైనా వెళ్తుంది. అవసరమైతే రోడ్డెక్కడానికైనా వెనుకాడదు’’ అని అశోక్బాబు హెచ్చరించారు.
Updated Date - 2023-11-04T21:48:07+05:30 IST