Union Govt: జగన్ సర్కార్కు కేంద్రం తీపికబురు..
ABN, First Publish Date - 2023-05-04T22:41:42+05:30
జగన్ సర్కార్ (JAGAN Govt) అప్పులు చేసేందుకు మరోసారి అనుమతి వచ్చింది.
అమరావతి: జగన్ సర్కార్ (JAGAN Govt) అప్పులు చేసేందుకు మరోసారి అనుమతి వచ్చింది. రూ. 3 వేల 500 కోట్ల సెక్యూరిటీ బాండ్ల (Security bonds) వేలానికి కేంద్ర ప్రభుత్వం (Union Govt) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది. గతంలో రూ. 6 వేల కోట్లకు బాండ్ల వేలానికి కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. నేటి వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎఫ్ఆర్బీఎం కింద ఏపీకి అనుమతి దక్కలేదు. రూ.1000 కోట్లు 6 ఏళ్లకు, మరో రూ. 1000 కోట్లు 20 ఏళ్లగాను బాండ్ల వేలం, రూ. 500 కోట్లు 8 సంవత్సరాలకు వేలం, మరో రూ. 500 కోట్లు 17 సంవత్సరాలకు బాండ్ల వేలం వేయనున్నారు. వచ్చే మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం జరగనుంది. అప్పటివరకు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు లేనట్టే అని తెలుస్తోంది.
ఇటీవల పార్లమెంట్ సాక్షిగా ఏపీ (AP) అప్పులను కేంద్రం మరోసారి బయటపెట్టింది. 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ఏపీ అప్పులు రూ. 4,42,442 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. బడ్జెట్లో అప్పులకు తోడు కార్పొరేషన్లు, ఇతర మార్గాల్లో అప్పులు అదనంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఏపీ అప్పులు రూ.10 లక్షల కోట్లకు చేరాయని విపక్షాల విమర్శలు చేస్తున్నాయి. ‘‘2109లో రాష్ట్ర అప్పులు రూ.2,64,451 కోట్లు ఉండగా.. 2020లో రూ.3,07,671 కోట్లు, 2021లో రూ.3,53,021 కోట్లు, 2022 సవరించిన అంచనాల తర్వాత రూ.3,93,718 కోట్లు, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లుగా ఉంది. ఏటా సుమారు రూ.45 వేల కోట్ల అప్పులు చేస్తోంది’’ అని పంకజ్ చౌదరి వెల్లడించారు.
Updated Date - 2023-05-04T22:44:51+05:30 IST