Kedar Selagamsetty: దుబాయ్లోనే కేదార్ అంత్యక్రియలు పూర్తి
ABN, Publish Date - Mar 04 , 2025 | 04:38 AM
హిందూ సంప్రదాయం ప్రకారం.. ఆయనకు దహన సంస్కారాలు నిర్వహించారు. వారం రోజులుగా కేదార్ మృతదేహం అప్పగింతపై నీలినీడలు అలుముకున్న విషయం తెలిసిందే..!
మరణం వెనుక కుట్ర లేదని తేల్చిన అధికారులు.. అంత్యక్రియలకు సినీ ప్రముఖులు దూరం
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
సినీ నిర్మాత కేదార్ సెలగంశెట్టి అంత్యక్రియలు దుబాయ్లోనే పూర్తయ్యాయి. హిందూ సంప్రదాయం ప్రకారం.. ఆయనకు దహన సంస్కారాలు నిర్వహించారు. వారం రోజులుగా కేదార్ మృతదేహం అప్పగింతపై నీలినీడలు అలుముకున్న విషయం తెలిసిందే..! దుబాయ్ పోలీసులు ఆయన మృతిపై విచారణ జరిపి, క్లీన్చిట్ ఇచ్చారు. కేదార్ మృతి పట్ల ఎలాంటి కుట్ర, నేరం లేదని తేల్చారు. అయితే.. భారతీయ కాన్సులేట్ నిరభ్యంతర పత్రం జారీలో ఆలస్యం ఏర్పడడంతో మృతదేహాన్ని అందించడంలో జాప్యం జరిగింది. తెలంగాణ సర్కారు ఎంబసీని సమాచారం కోరడంతో.. ఎన్వోసీ జారీలో ఆలస్యమైంది. సోమవారం కేదార్ అంత్యక్రియలను యూఏఈలో జరపడానికి తమకేమీ అభ్యంతరం లేదంటూ భారతీయ కాన్సులేట్ తరఫున అసిస్టెంట్ కాన్సులర్ ఆఫీసర్ ఉమేశ్యాదవ్ ఎన్వోసీని జారీ చేశారు. ‘‘అమెరికా పాస్పోర్టు ఉన్న కేదార్ భార్య రేఖావీణ నలితంకు మృతదేహాన్ని అప్పగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు’’ అని ఆ ఎన్వోసీలో పేర్కొన్నారు. అన్ని ప్రక్రియలు పూర్తవ్వడంతో కేదార్ కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు. ఆ వెంటనే.. కేదార్ భార్య రేఖావీణ, ఇతర కుటుంబ సభ్యులు దుబాయ్లోనే అంత్యక్రియలు నిర్వహించారు.
తమ కుటుంబం ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులతో సంబంధాల కారణంగా అన్నివిధాలుగా నష్టపోయిందని, అంత్యక్రియల విషయంలోనైనా వారికి దూరంగా ఉండాలని కోరుకున్నట్లు కేదార్ కుటుంబసభ్యులు తెలిపారు. స్వదేశంలో అంత్యక్రియలు నిర్వహిస్తే..విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి దహన సంస్కారాల వరకు మీడియా హడావుడి ఉంటుందని, అందుకే దుబాయ్లో ఆ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలుస్తోంది. కేదార్ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీడియాతో చిట్చాట్లో చేసిన వ్యాఖ్యల తర్వాత కేదార్తో సన్నిహిత సంబంధాలున్న రాజకీయ, సినీ ప్రముఖులు ప్రస్తుత పరిణామాలకు దూరంగా ఉంటున్నారు. ఈ కారణంగా కేదార్ అంత్యక్రియల్లో వారు పాల్గొనలేదని సమాచారం. కాగా.. 2018లో సినీనటి శ్రీదేవి మృతిచెందినప్పుడు.. మూ డ్రోజుల్లోనే దుబాయ్ పోలీసులు విచారణను పూర్తిచేసి, మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. కేదార్ విషయంలో దర్యాప్తులో.. ఫోరెన్సిక్ నివేదిక రావడంలో చాలా ఆలస్యం ఏర్పడడం గమనార్హం..!
మరణంపై విచారణ జరిపించండి: ఎంపీ చామల
హైదరాబాద్, మార్చి 3(ఆంధ్రజ్యోతి): కేదార్ మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి లేఖ రాశారు. కేదార్నాథ్ చనిపోయినప్పుడు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కొందరు దుబాయిలోనే ఉన్నారని, కేదార్ మరణంలో వారి ప్రమేయం ఉందన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయన్నారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేసిన బీఆర్ఎస్ నేతలు.. ఆ డబ్బులను కేదార్ ద్వారా దుబాయిలో పెట్టుబడి పెట్టించారన్న ఆధారాలున్నాయని తెలిపారు. సోమవారం చామల మీడియాతో మాట్లాడారు. హరీశ్రావు దోస్తు బిడ్డ పెళ్లి మార్చి 6న ఉంటే.. ఫిబ్రవరి 22నే ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఆయన దుబాయి వెళ్లాకే కేదార్ చనిపోయాడని అన్నారు.
Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..
Also Read: ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్
For Telangana News And Telugu News..
Updated Date - Mar 04 , 2025 | 04:38 AM